Mumbai Travel Update: ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోవడంతో అవస్థలు పడుతున్నారు.భారత వాతావరణ శాఖ మొదట జారీ చేసిన రెడ్ అలర్ట్ ను ఆరెంజ్ అలర్ట్ గా తగ్గించినప్పటికీ, ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారీ వర్షాల ప్రభావంతో ముంబై, పూణే విమాన సేవలపై కూడా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఇండిగో ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఫ్లైట్ స్టేటస్ ను అధికారిక వెబ్ సైట్ లేదంటే యాప్ లో తప్పనిసరిగా చూసుకోవాలని తెలిపింది. అలాగే రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే బయలుదేరాలని సూచించింది. ఇతర విమానయాన సంస్థలు కూడా విమానాలు ఆలస్యం కావడం లేదంటే షెడ్యూల్ మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రయాణికులను అలర్ట్ చేశాయి.
రైల్వే సేవలపైనా భారీ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముంబై సెంట్రల్ డివిజన్ పరిధిలో పలుచోట్ల పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు MEMU రైళ్లను రద్దు చేశారు. కొన్ని దూర ప్రయాణ రైళ్లు కూడా రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించారు. రాజస్థాన్ వైపు వెళ్లే కొన్ని రైళ్ల షెడ్యూల్లో కూడా మార్పులు చేశారు. మరోవైపు, ఠాకుర్వాడి–మంకీ హిల్ స్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడటంతో సెంట్రల్ రైల్వే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని, మిగిలిన చోట్ల కూడా త్వరగా సేవలను పునరుద్ధరించేందుకు సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని వెల్లడించారు.
వెస్టర్న్ రైల్వే లోకల్ రైళ్లు చర్చ్ గేట్ నుంచి దహను రోడ్ వరకు 10 నుంచి 15 నిమిషాల ఆలస్యంతో నడుస్తున్నాయి. అయితే, వసాయి రోడ్–విరార్ మధ్య నిలిచిపోయిన లోకల్ రైలు సేవలను తిరిగి ప్రారంభించారు. ముంబై సెంట్రల్–అహ్మదాబాద్ గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను కూడా మళ్లీ నడిపారు. ప్రయాణికులు బయలుదేరే ముందు తమ రైలు, విమానానికి సంబంధించిన తాజా సమాచారం తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: ముంబైలో రెడ్ అలర్ట్.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం!