New Train Services from Telangana: హైదరాబాదీయులకు భారతీయ రైల్వే క్రేజీ న్యూస్ చెప్పింది. 8 కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. భాగ్యనగరంలోని పలు రైల్వే స్టేషన్ల నుంచి ఈ కొత్త రైలు సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ రైళ్లు వారానికి ఒకసారి నడిచే వీక్లీ స్పెషల్ సర్వీసులుగా అందుబాటులోకి రానున్నాయి. రైల్వేశాఖ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా దూరప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త రైళ్లకోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రైల్వే మంత్రితో మాట్లాడి, ప్రయాణికుల అవసరాలను వివరించిన తర్వాత ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుచానూరు లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు ఎప్పటినుంచో మరిన్ని రైళ్ల కోసం కోరుతూ వచ్చారు. అదే విధంగా జైపూర్, శ్రీ గంగానగర్, భువనేశ్వర్ వంటి దూర ప్రాంతాలకు కూడా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి ఈ కొత్త సర్వీసులు నడపాలని నిర్ణయించారు. వీటిలో ఐదు రైళ్లు ప్రత్యేకంగా తిరుపతి, తిరుచానూరు మార్గాలకు కేటాయించబడ్డాయి. దీంతో భక్తులు ఇకపై తక్కువ ఇబ్బందులతో తమ యాత్రను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ 17607/17608 – కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30కు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది.
⦿ 17601/17602- కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది.
⦿ 17047/17048- చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 7 నుంచి ప్రారంభం కానుంది.
⦿ 17441/17442- చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 మే నుంచి ప్రారంభం కానుంది.
⦿ 17443/17444- చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది.
⦿ 17059/17060- ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 11 నుంచి ప్రారంభం కానుంది.
⦿ 17067/17068- ప్రతి సోమవారం సాయంత్రం 6.10 నిమిషాలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. మే 5 నుంచి ప్రారంభం కానుంది.
⦿ 17079/17080- ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన ప్రయాణ సమయాలు కూడా ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా నిర్ణయించారు. ముఖ్యంగా రాత్రి సమయంలో బయలుదేరే సర్వీసులు ఉండటం వల్ల ఉద్యోగులు, కుటుంబాలతో ప్రయాణించే వారికి ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రయాణం మరింత సులభం అవుతుంది. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ కొత్త రైళ్లు మరింత ఉపయోగపడుతాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లపై ఉన్న ఒత్తిడి కూడా కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.
Read Also: రోడ్డు మీద ఉండే వైట్, యెల్లో లైన్స్ అర్థం ఏంటి? ప్రతి డ్రైవర్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!