Trains Cleaning: రైళ్లలో దూర ప్రయాణాలంటే.. ప్రయాణికులు ఎక్కువగా చేసే కంప్లైంట్ క్లీనింగ్ గురించే. సుదూర ప్రాంతాలకు నడిపే రైళ్ల టాయిలెట్స్, కోచ్ లు అపరిశుభ్రంగా ఉంటాయని ఫిర్యాదులు చేస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ క్లీన్ ట్రైన్ స్టేషన్ స్కీమ్ లో నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పథకం కింద రైల్వే మార్గాల్లోని పలు స్టాప్ లలో ట్రైన్ ను క్లీన్ చేస్తున్నారు.
దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ప్రయాణికుల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టెక్-ఎనేబుల్డ్ ప్రొఫెషనల్ టీమ్ల ద్వారా ఆన్బోర్డ్ క్లీనింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ విధానంలో జనరల్ బోగీలతో సహా అన్ని కోచ్లను నిర్దిష్ట స్టేషన్లలో మాత్రమే కాకుండా, అవసరమైనప్పుడు శుభ్రం చేస్తామని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న క్లీన్ ట్రైన్ స్టేషన్ పథకం కింద, రైళ్ల మార్గాల్లోని నిర్దిష్ట స్టాప్లలో శుభ్రం చేస్తున్నారన్నారు. అయితే, కొత్త సంస్కరణల మేరకు రైల్వే సిబ్బంది తనిఖీ చేస్తూ.. అవసరమైన విధంగా క్లీనింగ్ చేపడతారని మంత్రి అన్నారు. 52 వారాల్లో 52 సంస్కరణల్లో భాగంగా ఇవి తీసుకొచ్చినట్లు రైల్వే మంత్రి తెలిపారు.
పీక్, నాన్-పీక్ హవర్ ఆధారంగా క్లీనింగ్ ప్రాసెస్ ను ఫ్రీక్వెన్సీని నిర్ణయిస్తారని అశ్విని వైష్ణవ్ తెలిపారు. డ్రోన్ సాయంతో ట్రైన్ క్లీనింగ్ ప్రక్రియ చేపడతారని, వీటిని వార్ రూమ్లు పర్యవేక్షిస్తాయన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రొఫెషనల్, శిక్షణ పొందిన బృందాలను క్లీనింగ్ కు ఏర్పాటు చేశామన్నారు.
ఈ బృందాలు.. ట్రైన్ కోచ్లు, టాయిలెట్లు, బేసిన్లను క్లీన్ చేయడం, చెత్త సేకరణ, చిన్న మరమ్మతులు, నీళ్లు నింపడం వంటి పనులు చేస్తుంటాయి. భద్రతా పరికరాల కండిషన్ ను చెక్ చేస్తుంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రియల్ టైమ్లో క్లీనింగ్, రైళ్లలో సౌకర్యాలు, సిబ్బంది పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకుంటామని మంత్రి వైష్ణవ్ అన్నారు. తొలి విడతలో ఈ క్లీనింగ్ ప్రక్రియను 80 రైళ్లలో అమలు చేస్తామన్నారు. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకుని మిగతా రైళ్లకు విస్తరిస్తామని తెలిపారు.
రైల్వే సరకు రవాణాను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే స్థలంలో సరుకు రవాణాకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంచుతామన్నారు. గిడ్డంగులు, గ్రైండింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్, అగ్రిగేషన్ యూనిట్లు అభివృద్ధి చేస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న గోడౌన్లను కార్గో టెర్మినల్స్గా అప్గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read: 45 పైసలకు రూ.10 లక్షలు.. ఆరేళ్ల తర్వాత ఆ కుటుంబానికి ఊహించని ఆసరా, మీరు మిస్ కావద్దు!