Summer Special Trains Announced: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వే ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సెలవుల సీజన్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 15 వరకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. మొత్తం 18,262 ట్రిప్పులను ప్లాన్ చేస్తూ, సుమారు 908 వేసవి ప్రత్యేక రైళ్లు పలు జోన్లలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ అదనపు రైళ్లు అందుబాటులోకి తీసుకురావడం వల్ల రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణికులకు ఊరట లభించనుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల నుంచి పర్యాటక ప్రాంతాలు, స్వగ్రామాలకు వెళ్లే మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కువగా నడపనున్నారు.
అటు ఇప్పటికే ఎక్కువ డిమాండ్ ఉన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. వందే భారత్ రైళ్లు వేగం, సౌకర్యం వల్ల ప్రయాణికుల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే, రద్దీ సమయంలో ఈ రైళ్ల టికెట్లు ముందుగానే పూర్తిగా బుక్ అయిపోతాయి. చాలా సందర్భాల్లో వెయిటింగ్ లిస్టులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు వేసవి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రావడంతో కొంతమంది ప్రయాణికులు వాటి వైపు మళ్లే అవకాశముంది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో వందే భారత్ వెయిటింగ్ లిస్టులు తగ్గడం లేదంటే సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని మార్గాల్లో ఇదే పరిస్థితి ఉండకపోవచ్చు. ముఖ్యంగా దక్షిణాదిలోని కొన్ని రూట్లలో ఇప్పటికీ భారీ డిమాండ్ కొనసాగుతోంది. కొన్ని సర్వీసుల్లో 150 నుంచి 170 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదవుతోంది. అంటే, సీట్లు పూర్తిగా నిండిపోయి, అదనపు డిమాండ్ కొనసాగుతోంది. ఇలాంటి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు వచ్చినా కూడా వెంటనే ఒత్తిడి తగ్గకపోవచ్చు.
ఛార్జీల విషయంలో కూడా కొంత మార్పు కనిపించవచ్చు. వందే భారత్ రైళ్లు సాధారణంగా డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అనుసరిస్తాయి. డిమాండ్ ఎక్కువైతే టికెట్ ధరలు పెరుగుతాయి. మరోవైపు, వేసవి ప్రత్యేక రైళ్లు కొంతవరకు తక్కువ ధరల్లో, సాధారణ ఛార్జీలతో నడవవచ్చు. దీంతో విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను ఎక్కువగా ఎంచుకునే అవకాశం ఉంది.
రైల్వే అధికారులు ప్రస్తుతం మూడు ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వందే భారత్ రైళ్ల ఆక్యుపెన్సీ, టికెట్ బుకింగ్ వేగం, ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల స్పందన. గత అనుభవాల ప్రకారం, సరైన ప్రణాళికతో ప్రత్యేక రైళ్లు నడిపితే మొత్తం రద్దీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారు ఒకసారి వందే భారత్, అలాగే ప్రత్యేక రైళ్లలో అవైలబులిటీని చెక్ చేసుకోవడం మంచిది. మొత్తం మీద, ఈ వేసవిలో పెరుగుతున్న డిమాండ్ను తట్టుకునేందుకు రైల్వే శాఖ మెరుగైన ఏర్పాట్లు చేస్తోంది.
Read Also: వందే భారత్ క్రేజ్.. ఉత్తరాన్ని మించిపోయిన దక్షిణ భారతం!