Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే మనకు గుర్తొచ్చేది లక్షల్లో జీతం, ఏసీ గదుల్లో కూర్చుని చేసే పని. కానీ, దారి తప్పితే ఎంతటి విద్యావంతులైనా సరే ఊహించని ఊబిలో కూరుకుపోతారని నిరూపించింది ఈ ఘటన. హైదరాబాద్లోని నాచారంలో వెలుగుచూసిన ఈ ఉదంతం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
తూర్పు గాంధీనగర్కు చెందిన సి. శశిధర్ అనే యువకుడు గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. అయితే, కొంతకాలం క్రితం తన ఉద్యోగాన్ని వదిలేసిన శశిధర్, ఆ తర్వాత చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ముఖ్యంగా గంజాయికి అలవాటు పడటంతో, దాన్ని కొనడానికి భారీగా ఖర్చయ్యేది. చేతిలో ఉద్యోగం లేక, కొనుక్కోవడానికి డబ్బులు సరిపోకపోయేసరికి.. అతను ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. బయట కొనే బదులు తన ఇంటి డాబాపైనే గంజాయి మొక్కలను పెంచడం మొదలుపెట్టాడు.
పక్కా సమాచారంతో దాడులు చేసిన నాచారం పోలీసులు, అతని ఇంటి మేడపై పెరుగుతున్న 17 గంజాయి మొక్కలను, నిల్వ ఉంచిన సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తన అవసరాల కోసమే వీటిని పెంచుతున్నట్లు నిందితుడు అంగీకరించాడు. చదువుకున్న విజ్ఞానాన్ని మంచి పనులకు వాడాల్సింది పోయి, ఇలా నేరాలకు పాల్పడి కటకటాల పాలవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి శశిధర్ను రిమాండ్కు తరలించారు.
Also Read: కరీంనగర్లో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు!