India’s First Bullet Train Design Revealed: ఫస్ట్ ఇండియన్ బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ముంబై–అహ్మదాబాద్ మధ్య నడవనున్న ఈ హైస్పీడ్ రైలు డిజైన్ ను అధికారికంగా ప్రజల ముందుకు తీసుకొచ్చింది. న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ గేట్ నంబర్–4 దగ్గర ఈ బుల్లెట్ రైలు ఫోటోను ఏర్పాటు చేశారు. దీంతో దేశంలో హైస్పీడ్ రైలు ప్రయాణానికి సంబంధించిన ఆసక్తి మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ఈ బుల్లెట్ రైలుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలను చూసి ఫిదా అవుతున్నారు. చూడ్డానికి బుల్లెట్ రైలు భలే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర, గుజరాత్తో పాటు దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళ్లనుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిల్లిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉండనున్నాయి.
A picture of the country's first proposed bullet train has been displayed at the Ministry of Railways. The picture has been installed at Gate Number 4: Indian Railways pic.twitter.com/LcbwMstDuw
— ANI (@ANI) May 18, 2026
2027 ఆగస్టు 15 నాటికి తొలి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో సూరత్–వాపి మధ్య ఈ రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్కు వెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతుండగా, బుల్లెట్ రైలు ప్రారంభమైన తర్వాత ఈ ప్రయాణ సమయం దాదాపు రెండు గంటలకు తగ్గనుంది.
ఈ ప్రాజెక్టులో ఉపయోగించనున్న B28 మోడల్ బుల్లెట్ రైళ్లను బెంగళూరుకు చెందిన BEML సంస్థ స్వదేశీ సాంకేతికతతో తయారు చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), BEML కలిసి హైస్పీడ్ రైలు సెట్లను అభివృద్ధి చేస్తున్నాయి. వీటి డిజైన్ వేగం గంటకు 280 కిలోమీటర్లుగా ఉంటుంది.
ప్రస్తుతం గుజరాత్ లోని వాపి, బిల్లిమోరా, సూరత్, భరూచ్, ఆనంద్, వడోదర, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లలో పునాది పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని థానే, విరార్, బోయిసర్ ప్రాంతాల్లో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) స్టేషన్ దగ్గర తవ్వకాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న వంతెనల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 17 వంతెనల నిర్మాణం పూర్తయ్యింది. నర్మదా, మహి, తాప్తి, సబర్మతి నదులపై నిర్మిస్తున్న ప్రధాన వంతెనలు తుది దశలో ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా నాలుగు వంతెనల పనులు కొనసాగుతున్నాయి.
అటు సముద్రగర్భంలో టన్నెల్ నిర్మాణం కూడా ఈ ప్రాజెక్టులో కీలకంగా మారనుంది. ఘన్సోలి–షిల్ఫాటా మధ్య 4.8 కిలోమీటర్ల సొరంగ మార్గం ఇప్పటికే పూర్తయింది. BKC ప్రాంతంలో తవ్వకాలు 91 శాతం పూర్తయ్యాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం భూమిని సేకరించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భూసేకరణలో చట్టపరమైన నిబంధనలు పాటించడంతో పాటు బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించారు. జపాన్ సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నప్పటికీ, భారత వాతావరణం, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మార్పులు చేసినట్లు వివరించారు.
Read Also: 3 గంటల్లో హైదరాబాద్- ముంబై ప్రయాణం.. బుల్లెట్ రైలు డీపీఆర్ రెడీ!