India’s bullet train: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. ఇప్పటికీ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలో బుల్లెట్ రైళ్లు అడుగు పెట్టబోతున్నాయి. ఈ రైళ్లు గంటకు 300 కి.మీ కంటే ఎక్కువ వేగంతో పరుగులు తీయనున్నాయి. సుదూర ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నాయి. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై- అహ్మదాబాద్ మధ్య నిర్మాణంలో ఉంది. 2027 నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 2029 నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత దేశంలో మరిన్ని హైస్పీడ్ రైలు కారిడార్లను ప్లాన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వీటిలో రెండు ముఖ్యమైన మార్గాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని నగరాలను కలపనున్నాయి. అందులో ఒకటి హైదరాబాద్-చెన్నై కారిడార్ కాగా, మరొకటి హైదరాబాద్-బెంగళూరు కారిడార్. ఇవి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు వ్యాపారం, పర్యాటకాన్ని మరింత పెంచనున్నాయి.
మన దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై- అహ్మదాబాద్ నడుమ పరుగులు తీయనుంది. మొత్తం 508 కిలో మీటర్ల పరిధిలో ఈ కారిడార్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో జపనీస్ షింకన్సేన్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే పలు బ్రిడ్జిలు, టన్నెల్స్ ను నిర్మించారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. గుజరాత్లోని సూరత్, బిల్మోరా మధ్య ఒక భాగం 2027లో ప్రారంభం కావచ్చు.
ఇది సౌత్ ఇండియాలో అత్యంత కీలకం కానుంది. ఇది దాదాపు 778 కి.మీ పొడవు ఉంటుంది. తెలంగాణలోని హైదరాబాద్ను తమిళనాడులోని చెన్నైకి అనుసంధానిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది.
ఇది తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో దాదాపు 6 స్టేషన్లు ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఈ మార్గం అమరావతి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతిని కలుపుతూ వెళ్తుంది. తమిళనాడులో చెన్నై సెంట్రల్, రింగ్ రోడ్లోని మింజూర్ సమీపంలో స్టేషన్లలో ఆగనుంది. కచ్చితమైన స్టేషన్లు ఇంకా ఖరారు కాలేదు. కానీ, అమరావతి కీలకమైన స్టాప్గా కన్ఫార్మ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానిని పెద్ద రవాణా కేంద్రంగా మారనుంది.
ప్రస్తుతం హైదరాబాద్- చెన్నై మధ్య సాధారణ రైళ్లు దాదాపు 12 గంటలు ప్రయాణిస్తాయి. ఈ బుల్లెట్ రైలుతో కేవలం 2 గంటల 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలు, పర్యాటకులు, సాధారణ ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉంటుంది.
సౌత్ లో మరో కీలక కారిడార్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుమారు 626 కి.మీ పొడవు ఉంటుంది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల గుండా వెళుతుంది.హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వే మార్గం ఏపీలోని కర్నూలు లేదంటే అనంతపురం మీదుగా వెళ్తుంది. కర్ణాటకలోని బెంగళూరులో ముగుస్తుంది. ఈ మార్గం ప్రయాణ సమయాన్ని దాదాపు 2 నుంచి 3 గంటలకు తగ్గిస్తుంది. ఇది రెండు నగరాల్లోని ఐటీ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెండు కారిడార్లు భవిష్యత్తులో హై-స్పీడ్ ట్రయాంగిల్ ను ఏర్పరుస్తాయి. ముఖ్యంగా బెంగళూరు-చెన్నై లింక్ జోడించబడితే.. హైదరాబాద్, అమరావతి, బెంగళూరు, చెన్నైలను త్వరగా కలుపుతుంది.
ప్రస్తుతం ఈ రెండు కారిడార్లు ఇంకా ప్రణాళిక దశలోనే ఉన్నాయి. 2030లో లేదంటే ఆ తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, కీలకమైన వైజాగ్ నగరానికి బుల్లెట్ రైలు గురించి ఎలాంటి ప్రణాళికలేకపోవంపై ఆప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: కూని రాగాలు తీసే రైల్వే వంతెన.. ఎక్కడుందో తెలుసా?