India’s First Undersea Bullet Train: దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. తొలి హైస్పీడ్ రైలు సర్వీస్ పై దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ రైలు సముద్రం కింద ప్రయాణించనుండటం, పర్వతాల గుండా సొరంగాల్లో వెళ్లనుండటం మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవడానికి సాధారణ రైళ్లలో 7 గంటలకు పైగా సమయం పడుతోంది. కానీ, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
ఈ హైస్పీడ్ రైలు మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లలో ఆగుతుంది. ఈ బుల్లెట్ రైలు సేవలను 2027 ఆగస్టు 15 నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ కు మొదట రూ.1.10 లక్షల కోట్ల వ్యయం అంచనా వేశారు. తర్వాత ఈ ఖర్చు రూ.1.25 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ప్రతి కిలోమీటర్ నిర్మాణానికి సుమారు రూ.212 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా భారీ స్థాయిలో వంతెనలు, సొరంగాలు నిర్మిస్తున్నారు. మొత్తం 25 ప్రధాన నదులపై వంతెనలు నిర్మిస్తున్నారు. వీటిలో 21 గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉన్నాయి. అదనంగా 28 ఉక్కు వంతెనలు కూడా ఈ మార్గంలో భాగంగా ఉంటాయి.
ఈ ప్రాజెక్ట్ లో అత్యంత ప్రత్యేకమైన అంశం అండర్ సీ టన్నెల్. దేశ చరిత్రలో తొలిసారిగా రైలు సముద్రం కింద ప్రయాణించబోతోంది. మొత్తం 21 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో మొదటి 7 కిలోమీటర్లు నేరుగా సముద్రం కిందుగా నిర్మిస్తున్నారు. ఈ సొరంగం ముంబై సమీపంలోని థానే ప్రాంతంలో నిర్మాణంలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 5 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన సొరంగ నిర్మాణం కోసం ప్రత్యేక టన్నెల్ బోరింగ్ మెషీన్లను ఉపయోగిస్తున్నారు. ఈ సొరంగంలో 13.1 మీటర్ల వ్యాసంతో పెద్ద పైప్ లైన్ నిర్మిస్తున్నారు. దాని లోపల బుల్లెట్ రైలు ప్రయాణించనుంది. ఇక ఈ రైలు మార్గంలో 21 కిలోమీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం ఉంటుంది. అంతేకాకుండా, పలు పర్వత ప్రాంతాల్లో తవ్విన ఎనిమిది సొరంగాల గుండా రైలు వెళ్లనుంది. వీటిలో ఎక్కువ భాగం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉండగా, ఒక సొరంగం గుజరాత్ లోని వల్సాద్ ప్రాంతంలో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం గుజరాత్ లోని ఎనిమిది స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే భారత రైల్వే చరిత్రలో ఓ పెద్ద మైలురాయిగా మారనుంది.
Read Also: చికెన్స్ నెక్ కు బుల్లెట్ ట్రైన్.. కేంద్రం ప్లాన్ మామూలుగా లేదుగా!