India’s First Underwater Cycling: సాధారణంగా రోడ్ల మీద, పర్వత ప్రాంతాల్లో సైకిల్ తొక్కడం చూస్తుంటాం. కానీ, కొంతమంది విశాఖ కుర్రాళ్లు ఏకంగా సముద్ర గర్భంలో సైకిల్ తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని రుషికొండ తీరంలో అరుదైన సాహస కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, లైవ్ ఇన్ అడ్వంచర్స్ స్కూబా డైవింగ్ అకాడమీ వ్యవస్థాపకుడు బి. బలరాం నాయుడు ఆధ్వర్యంలో ఈ సాహస యాత్ర జరిగింది. ఆయనతో పాటు నలుగురు స్కూబా డైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య సముద్రంలోకి దిగిన వారు దాదాపు 20 నిమిషాల పాటు సముద్రపు అడుగుభాగంలో సైకిళ్లు తొక్కారు.
ఈ అడ్వెంచర్ ఈవెంట్ లో పాల్గొన్న డైవర్లు ఆక్సిజన్ సిలిండర్లు, స్కూబా డైవింగ్ పరికరాలు ధరించి సముద్ర గర్భంలో సైక్లింగ్ చేశారు. సముద్రపు అడుగున సైకిల్ తొక్కడం అంత సులభమైన విషయం కాదు. నీటి ఒత్తిడి, సముద్రపు అలలు, అడుగుభాగంలోని పరిస్థితులను తట్టుకుని సక్సెస్ ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుక ప్రత్యేక ఉద్దేశం ఉందని బలరాం నాయుడు తెలిపారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం, అలాగే కాలుష్య నియంత్రణకు సైకిల్ వినియోగం ఎంత అవసరమో తెలియజేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. రోజువారీ జీవితంలో సైకిల్ వినియోగాన్ని పెంచితే వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు.
యువతలో సైక్లింగ్ పట్ల ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు అనేక ప్రాంతాల్లో సైకిల్ క్లబ్లు చాలా చురుకుగా పనిచేసేవని, ప్రస్తుతం వాటి కార్యకలాపాలు తగ్గిపోయాయని బలరాం చెప్పుకొచ్చారు. కొత్త తరం యువతను సైక్లింగ్ వైపు ఆకర్షించేందుకు సైకిల్ క్లబ్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ వినూత్న సాహస కార్యక్రమం చూసిన జనం డైవర్ల ధైర్యసాహసాలను ప్రశంసించారు. సముద్ర గర్భంలో సైకిల్ తొక్కడం ద్వారా అడ్వెంచర్ ఈవెంట్స్ లో విశాఖ మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందిందంటున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సైక్లింగ్ ప్రాధాన్యతను గుర్తు చేస్తూనే, యువతకు స్ఫూర్తినిచ్చేలా చేసింది.