Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పాలమూరు జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పురోగతిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
మొదటిరోజు షెడ్యూల్.. మక్తల్ నుంచే శ్రీకారం
సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకుని నేరుగా మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్ చేరుకుంటారు. అక్కడ మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (MNKLIS), భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం 3.40 నుంచి 4 గంటల వరకు సీఎం క్షేత్రస్థాయిలో పనులను స్వయంగా పరిశీలిస్తారు.
ఏరియల్ వ్యూ పరిశీలన.. ప్రాజెక్టుల సందర్శన
సాయంత్రం 4.10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి కోయిల్సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా (ఏరియల్ వ్యూ) పరిశీలిస్తారు. ఆ తర్వాత 4.55 గంటల నుంచి గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్ఎల్ఐఎస్ స్టేజ్-1 పంప్హౌస్ను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తారు.
సోమశిలలో హైలెవల్ మీటింగ్.. రాత్రి బస
సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు సోమశిలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పనుల్లో జాప్యం, నిధుల విడుదలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం రాత్రికి ఆయన సోమశిలలోనే బస చేసి, మరుసటి రోజు (రెండో రోజు) పర్యటనను కొనసాగిస్తారు.
Also Read: గంజాయి డాన్గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!