దేశ వ్యాప్తంగా ఇండిగో సంస్థ వందలాదిగా విమాన సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా రెండో రోజూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు కావడంతో ప్యాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో నిన్న దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దు చేయగా, ఇవాళ 170 విమాన సర్వీసులను క్యాన్సిల్ చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 28 విమానాలు, రావాల్సిన 27 విమానాలు రద్దయ్యాయి. శబరికి వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ఇతర ప్రయాణీకులు కూడా తమకు ముందస్తు సమాచారం లేదని, గంటల తరబడి ఎయిర్ పోర్టులో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడుతున్నారు. అటు రేపు కూడా విమాన సర్వీసులకు అంతరాయం తప్పదని ఇండిగో ప్రకటించింది. మరోవైపు ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు మొదలు పెట్టింది.
విమానాల రద్దుపై ఇండిగో కీలక ప్రకటన చేసింది. అకస్మాత్తుగా ఆపరేషనల్ ఇబ్బందులు తలెత్తడంతో విమానాల సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. సాంకేతిక లోపాలు, వింటర్ షెడ్యూల్ షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణం, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ, సిబ్బంది డ్యూటీ సమస్యల కారణంగా పలు ఈ సర్వీసులను రద్దు అయినట్లు ప్రకటించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు మరో మరో 48 గంటల పాటు సమయం పడుతుందని తెలిపింది. అయితే, ఇండిగో విమాన సర్వీసుల రద్దు వెనుక ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. వాళ్లు ప్రస్తుతం చెప్పిన కారణాలు సహేతుకంగా లేవంటున్నారు. అసలు కారణాలు ఏంటనేది త్వరలోనే బయటకు వస్తుందంటున్నారు నిపుణులు.
పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు అయిన నేపథ్యంలో చాలా మంది ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు విమానాశ్రయాలలో సిబ్బందితో గొడవపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ప్రయాణీకులు ఎయిర్ లైన్ సిబ్బందితో వాదనలకు దిగుతున్న ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. విమానం అందుబాటులో లేనప్పుడు ఎందుకు షెడ్యూల్ చేశారని నిలదీస్తున్నారు. అత్యవసర పనుల మీద వెళ్తున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
శ్రీకర్ కందికొండ షేర్ చేసిన వీడియోలో ప్రయాణీకులు బోర్డింగ్ గేట్ దగ్గర ఇండిగో సిబ్బందితో గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి నుండి విమానయాన సంస్థ ప్రయాణీకులను ఇబ్బంది పెడుతుందని ఆయన మండిపడ్డారు. విమానం బయల్దేరడానికి గంట ముందు రద్దు చేసినట్లు చెప్పారని, అప్పటికే తాము ఎయిర్ పోర్టుకు చేరుకున్నామని మండిపడ్డారు. 24 గంటలకు పైగా విమానాశ్రయంలో వేచి ఉన్నట్లు చెప్పారు. అటు 6E 883 విమానం పదే పదే రద్దు కావడంతో తాను మూడు రోజులుగా హైదరాబాద్లో చిక్కుకుపోయానని రవి ఠక్కర్ వెల్లడించారు. తన స్టే, ట్రావెల్ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు.
Read Also: ఎయిర్ పోర్టులపై కొత్త కుట్ర, అదే జరిగితే ప్రయాణీకుల ప్రాణాలు గాల్లోనే..