GPS Spoofing Airports: గత కొద్ది నెలలుగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్టుల మీద సరికొత్త కుట్రలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, అమృత్ సర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాలతో సహా ప్రధాన భారతీయ విమానాశ్రయాల సమీపంలో జీపీఎస్ స్పూఫింగ్ కోసం కొంత మంది దుండగులు ప్రయత్నించారు. వాటిని ఎయిర్ పోర్టు రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. రన్ వేల మీదకి వచ్చే విమానాల కోసం GPS ఆధారిత ల్యాండింగ్ విధానాలను ఉపయోగిస్తారు. ఆగంతకులు ఆ వ్యవస్థకు తప్పుడు సంకేతాలు ఇచ్చి, నావిగేషన్ వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు.
జీపీఎస్ స్పూఫింగ్ కు సంబంధించి పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. “కొన్ని విమానాలు న్యూఢిల్లీలోని IGIA పరిసరాల్లో GPS ఆధారిత ల్యాండింగ్ విధానాలను ఉపయోగిస్తున్నప్పుడు GPS స్పూఫింగ్ కు కొంత మంది పాల్పడినట్లు రిపోర్టు వచ్చింది. రన్ వే 10కి విమానాలు సమీపిస్తున్నప్పుడు జీపీఎస్ స్పూఫింగ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ స్ఫూపింగ్ విమానాల కదలికలపై ఎటువంటి ప్రభావం చూపించలేదు. వీటిని ఎదుర్కొనేందుకు రన్ వే చివరిలో ఉన్న సంప్రదాయ నావిగేషన్ వ్యవస్ధలు సాయం చేశాయి” అని వివరించారు. ప్రభుత్వం వైర్ లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ (WMO)ని స్పూఫింగ్ కు ఎవరు పాల్పడుతున్నారో గుర్తించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. కోల్కతా, అమృత్సర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల నుండి జీపీఎస్ స్పూఫింగ్ నివేదికలు అందుతున్నట్లు నాయుడు చెప్పారు.
ఎయిర్ పోర్టు సమీపం నుంచి కొంత మంది ఫేక్ GPS సిగ్నల్స్ ను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తప్పుడు నావిగేషన్ డేటా ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, విమానయాన సంస్థలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. సిస్టమ్ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఆ తర్వాత విమానాలు ఫేక్ సంకేతాల అనుసరించి ఘోర ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. GPS స్పూఫింగ్ ప్రయత్నాలు పైలట్లు, ఆన్ బోర్డ్ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తప్పుడు హెచ్చరికలు, సూచనలు విమానాల క్రాష్ కు కారణం అయ్యే అవకాశం ఉంటుంది.
GPS స్పూఫింగ్ వ్యవహారలపై DGCA కీలక సూచన చేసింది. స్పూఫింగ్ ఘటన జరిగిన 10 నిమిషాల్లోపు నివేదించాలని ఏవియేషన్ వాచ్ డాగ్ పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ATC)కు సూచించింది. గ్రౌండ్ బేస్డ్ నావిగేషన్, సర్వైలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన మినిమమ్ ఆపరేటింగ్ నెట్ వర్క్ (MON)ను ఉపయోగించుకోవాలన్నది. ప్రస్తుతం విమానయాన రంగానికి ప్రపంచ సైబర్ భద్రతా ముప్పు, రాన్సమ్ వేర్, మాల్వేర్ రూపంలో ఉన్నట్లు వెల్లడించింది. వీటిని ఎదుర్కొనేందుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐటీ నెట్ వర్క్ ప్రత్యేక సైబర్ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సైబర్ ముప్పు, స్వభావం, రకం మారుతున్న కొద్దీ, కొత్త రక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
Read Also: ఎయిర్ బస్ A320 విమానాల రీకాల్.. కారణం ఏంటంటే?