New Golden Chariot Discount: దక్షిణ భారతాన్ని అత్యంత ఆహ్లాదకరంగా చుట్టురావాలనుకునే పర్యాటకులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 పర్యాటక సీజన్ కోసం గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును సరికొత్త రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక సౌకర్యాలు, కొత్త ఇంటీరియర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో ఈ రైలును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
భారతీయ రైల్వేకు చెందిన గోల్డెన్ చారియట్ ఇప్పటికే దేశంలోని ప్రముఖ లగ్జరీ రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు దీనిని మరింత అత్యాధునికంగామార్చి కొత్త సీజన్కు సిద్ధం చేశారు. సంప్రదాయ భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్ తో పాటు ఆధునిక సౌకర్యాలను కలిపి ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నారు. ఈ రైలులో క్యాబిన్లను పూర్తిగా అప్ గ్రేడ్ చేశారు. మెరుగైన ఫర్నిచర్, పాలిష్ చేసిన ఉడ్ ఇంటీరియర్లు, విలాసవంతమైన బెడ్ లినెన్లు, ప్రీమియం బాత్ రూమ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి క్యాబిన్ లో స్మార్ట్ టీవీతో పాటు వై ఫై స్ట్రీమింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ప్రయాణ సమయంలో చక్కటి వినోదాన్ని పొందే అవకాశం ఉంటుంది.
భద్రత విషయంలో కూడా ఐఆర్సిటిసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రైలంతా సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక ఫైర్ అలారం వ్యవస్థలను అమర్చారు. దీంతో ప్రయాణికుల భద్రత మరింత మెరుగుపడనుంది.
గోల్డెన్ చారియట్లో మొత్తం 40 క్యాబిన్లు ఉండగా, ఒకేసారి 80 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇందులో 13 డబుల్ బెడ్ క్యాబిన్లు, 26 ట్విన్ బెడ్ క్యాబిన్లు ఉన్నాయి. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ క్యాబిన్ ను కూడా ఏర్పాటు చేశారు. భోజన ప్రియుల కోసం రెండు ప్రత్యేక రెస్టారెంట్లు సిద్ధంగా ఉన్నాయి. ‘రుచి’, ‘నలపాక’ పేర్లతో ఉన్న ఈ రెస్టారెంట్లలో భారతీయ, అంతర్జాతీయ వంటకాలు అందిస్తారు. అలాగే ‘మదిర’ లాంజ్ బార్ లో పలు రకాల డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైలులో స్పా, ఫిట్ నెస్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఆయుర్వేద చికిత్సలు, వెల్ నెస్ థెరపీలు, వ్యాయామ సౌకర్యాలు అందిస్తారు.
2026-27 సీజన్ కోసం ఐఆర్సిటిసి మూడు ప్రత్యేక టూర్ ప్లాన్స్ ప్రకటించింది. ‘ప్రైడ్ ఆఫ్ కర్ణాటక’ ప్యాకేజీ ద్వారా బెంగళూరు, బండిపూర్, మైసూరు, హలేబీడు, చిక్కమగళూరు, హంపి, గోవా ప్రాంతాలను సందర్శించవచ్చు. ‘జ్యూయల్స్ ఆఫ్ సౌత్’ ప్యాకేజీలో మైసూరు, కాంచీపురం, మహాబలిపురం, తంజావూరు, కొచ్చిన్ లాంటి చారిత్రక ప్రాంతాలు ఉంటాయి. ‘గ్లింప్సెస్ ఆఫ్ కర్ణాటక’ ప్యాకేజీ నాలుగు రోజుల స్వల్పకాలిక టూర్ గా రూపొందించారు.
ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రత్యేక డిస్కౌంట్లను కూడా ప్రకటించారు. ఎంపిక చేసిన ప్రయాణాలపై 20 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నారు. అలాగే జూన్ 30, 2026లోపు అడ్వాన్స్ బుకింగ్ చేసే వారికి అదనంగా 5 శాతం ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ లభిస్తుంది.
Read Also: ఒకప్పుడు ఫుల్ డిమాండ్.. ఇప్పుడు ఖాళీ బోగీలు.. లగ్జరీ రైలు ట్రిప్స్ క్యాన్సిల్!