ఉత్తర ప్రదేశ్ లో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లక్నోబారాబంకి లోని రామ్ నగర్- ఫతేపూర్ ఫ్లై ఓవర్ నుంచి చెక్క ముక్కలతో వెళ్తున్న ట్రక్కు రెయిలింగ్ ను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా బారాబంకి-గోండా మార్గంలోని బుర్హ్వాల్ జంక్షన్ సమీపంలోని అప్ లైన్ ట్రాక్ మీద పడిపోయింది. అదే సమయంలో అమృత్ సర్ – సహర్సా గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ (12204) పక్కనే ఉన్న డౌన్ లైన్ లో ప్రయాణిస్తుంది. ఈ ఘటనలో ప్రయాణీకులెవరూ గాయపడలేదు. కానీ, ఫ్లై ఓవర్ నుంచి పెద్ద రాయి గరీబ్ రథ్ G2 కోచ్ పైకప్పుపై పడింది. కూలిన రెయిలింగ్ శిథిలాలు రైలు పైభాగాన్ని తగిలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ ఘటనతో బారాబంకి- గోండా వెళ్ళే రెండు ట్రాక్ లపై రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే గోండా స్టేషన్ నుంచి ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు ట్రాక్ మీది నుంచి ట్రక్కును తొలగించాయి. దెబ్బతిన్న రైలు పట్టాలను సరిచేశారు. ఆరు గంటల తర్వాత సేవలు మళ్లీ పునరుద్ధించారు. ఈ సమయంలో 24 రైళ్లు ప్రభావితమయ్యాయి. గరీబ్ రథ్ తెల్లవారుజామున 3.30 గంటలకు బీహార్ కు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది.
ఇలాంటి సంఘటన ఆగస్టు 16, 2022న కూడా జరిగింది. లక్నో-చండీగఢ్ ఎక్స్ ప్రెస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నుంచి ముండా పాండే- రాంపూర్ స్టేషన్ల మధ్య ట్రాక్ పైకి పాల ట్రక్కు పడిపోవడంతో పట్టాలు దెబ్బతిన్నాయి. తాజాగా జరిగిన ఘటనలో రైలు కోచ్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దాని పైకప్పు డ్యామేజ్ అయ్యింది. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ లు వేసి రైలును ఆపాడు. ట్రక్కు క్యాబిన్ నుజ్జు నుజ్జు అయింది, డ్రైవర్ లోపల చిక్కుకున్నాడు. రెండు గంటలు కష్టపడి అతడిని ట్రక్కులో నుంచి బయటకు తీశారు. డ్రైవర్ను బయటకు తీయడానికి క్యాబిన్ను కట్ చేశారు. డ్రైవర్ ను గోండాకు చెందిన పంకజ్ కుమార్ గా గుర్తించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది గరీబ్ రథ్ G2 కోచ్ పగిలిన కిటికీలను మార్చారు.
అధికారుల వివరాల ప్రకారం.. ట్రక్ బారాబంకి నుంచి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న రామ్ నగర్- ఫతేపూర్ రహదారిపై ట్రక్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్లైవుడ్ తో సీతాపూర్ నుంచి బీహార్కు వెళ్లే సమయంలో రాత్రి 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బుర్హ్వాల్ స్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ దాటుతుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ట్రక్ దాదాపు 25 అడుగుల పై నుంచి ట్రాక్ మీద పడిపోయింది. అదే సమయంలో గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ప్రక్కనే ఉన్న లైన్పై వెళుతోంది. ట్రక్కు పడిపోవడంతో విద్యుత్ సరఫరా లైన్ దెబ్బతింది. మరమ్మతుల తర్వాత మళ్లీ రైళ్ల రాకపోకలు కొనసాగాయి.
Read Also: 19 గంటల ప్రయాణం 2 గంటల్లో పూర్తి.. వచ్చేస్తోంది బుల్లెట్ రైలు!