IRCTC E-Wallet Withdrawals: రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఎక్కువగా ఐఆర్సిటిసి (IRCTC) ఇ-వాలెట్ ఉపయోగిస్తారు. టికెట్ త్వరగా బుక్ చేసుకునేందుకు సాయపడటంతో పాటు నమ్మకమైన వాలెట్ కావడంతో ఎక్కువ మంది రైల్వే ప్రయాణికులు యూజ్ చేస్తున్నారు. తాజాగా ఐఆర్సిటిసి ఇ-వాలెట్ కు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఇ-వాలెట్ లో డబ్బు యాడ్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని నేరుగా క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశం లేదన్నారు. ఒకవేళ, వినియోగదారుడు తన ఇ-వాలెట్ అకౌంట్ ను పూర్తి క్లోజ్ చేస్తే, అందులో మిగిలిన మొత్తం తిరిగి అతడి బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయబడుతుందన్నారు.
ప్రస్తుతం చాలా మంది ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో వేగంగా చెల్లింపులు జరగడానికి ఐఆర్సిటిసి ఇ-వాలెట్ ను ఉపయోగిస్తున్నారు. ముందుగా కొంత డబ్బు వాలెట్ లో జమ చేసుకుని, అవసరమైనప్పుడు టికెట్లు బుక్ చేసుకోవడం దీనికి ముఖ్య ఉద్దేశం. అయితే, కొంతమంది వినియోగదారులు తమ వాలెట్ లో ఉన్న డబ్బును తిరిగి బ్యాంకు అకౌంట్ కు తీసుకునే అవకాశం ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, చాలా కాలం పాటు వాలెట్ లో డబ్బు ఉండిపోతే, దానిని ఇతర అవసరాలకు ఉపయోగించుకునే సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
ఈ అంశంపై అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఐఆర్సిటిసి ఇ-వాలెట్ అనేది క్లోజ్డ్ సిస్టమ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) కేటగిరీకి చెందినదని చెప్పారు. అంటే, ఈ వాలెట్లో జమ చేసిన డబ్బును కేవలం ఐఆర్సిటిసి సేవలకే ఉపయోగించాలి. ముఖ్యంగా రైలు టిక్కెట్లు కొనుగోలు చేయడానికి మాత్రమే అనుమతిస్తుందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, క్లోజ్డ్ సిస్టమ్ PPI ఖాతాల నుంచి నగదు ఉపసంహరణకు అనుమతి ఉండదన్నారు. అందువల్ల, వినియోగదారులు తమ వాలెట్ లో ఉన్న మొత్తాన్ని ఏటీఎం ద్వారా గానీ, బ్యాంకు ఖాతాకు నేరుగా గానీ తీసుకోలేరని చెప్పారు.
అయితే, ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చేలా మరో నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వినియోగదారులు మాత్రమే కాకుండా, కొత్తగా ఇ వాలెట్ తీసుకునే వారందరికీ కూడా ఖాతా మూసివేసే సమయంలో అందులో మిగిలిన మొత్తం తిరిగి వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుందన్నారు. ఈ నిర్ణయంతో ఐఆర్సిటిసి ఇ-వాలెట్ వినియోగంపై ఉన్న అనేక సందేహాలకు స్పష్టత వచ్చినట్టైంది. టికెట్ బుకింగ్ కు ఇది సౌకర్యవంతమైన మార్గమే అయినప్పటికీ, ఇందులో జమ చేసిన డబ్బు సాధారణ డిజిటల్ వాలెట్ లా ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం మాత్రం ఉండదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అందుకే, ప్రయాణికులు అవసరానికి అనుగుణంగా డబ్బులు జమ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: విశాఖ నుంచి ఢిల్లీకి స్పెషల్ రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!