Food on Train Service Across India: రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా కొనసాగేందుకు కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ixigo Trains, ConfirmTkt, Swiggy కలిసి ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన ‘ఫుడ్ ఆన్ ట్రైన్’ సర్వీసును అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ కొత్త సర్వీస్ ద్వారా ప్రయాణికులు తమ సీట్ల దగ్గరే నచ్చిన ఫుడ్ ఈజీగా ఆర్డర్ చేసుకుని పొందే అవకాశం ఉంది.
తాజాగా Ixigo, ConfirmTkt యాప్స్ లో Swiggy రెస్టారెంట్ నెట్ వర్క్ ను కలపడం వల్ల ఈ సర్వీసు మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలోనే రూట్ లోని ప్రముఖ నగరాల్లో పాపులర్ రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాపులర్ ఫుడ్స్ నుంచి లోకల్ ఫుడ్ వరకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ముందుగానే లేదంటే ప్రయాణంలో ఉండగా ఆర్డర్ చేసుకోవచ్చు. రైలు స్టేషన్ కు చేరుకునే సమయానికి ఆర్డర్ చేసిన భోజనం నేరుగా వారి సీటు దగ్గరే డెలివరీ అవుతుంది. ప్రయాణానికి 4 రోజుల ముందే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే రైలు రాకకు 30 నిమిషాల ముందు వరకు కూడా ఆర్డర్ పెట్టే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా 160కు పైగా రైల్వే స్టేషన్లలో ఈ సర్వీసు అందుబాటులో ఉంది. 40,000కు పైగా రెస్టారెంట్లు ఈ నెట్ వర్క్ లో భాగంగా ఉండటంతో, ప్రయాణికులకు బోలెడు ఫుడ్ ఆప్షన్స్ లభిస్తాయి. అదనంగా, ఆర్డర్ చేసిన భోజనం ఎక్కడ ఉందో లైవ్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సమయానికి డెలివరీ కాకపోతే పూర్తి రీఫండ్ కూడా అందిస్తామని స్విగ్గీ ప్రకటించింది.
ఈ సర్వీసును ఉపయోగించడం కూడా చాలా ఈజీ. Ixigo, ConfirmTkt యాప్ ను ఓపెన్ చేసి ‘Order Food on Train’ ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత PNR నంబర్ ను ఎంటర్ చేసి, డెలివరీ కావాల్సిన స్టేషన్ ను సెలెక్ట్ చేయాలి. తర్వాత అందుబాటులో ఉన్న రెస్టారెంట్ల నుంచి భోజనం ఎంచుకుని పేమెంట్ పూర్తి చేస్తే, ఆర్డర్ ప్రాసెస్ అవుతుంది.
ఇక తాజా భాగస్వామ్యంతో రైలు ప్రయాణంలో ఫుడ్ ఎక్స్ పీరియెన్స్ మరింత మెరుగుపడనుంది. ఇప్పటి వరకు ప్లాట్ ఫారమ్లో దొరికే ఫుడ్ మీద ఆధారపడాల్సి వచ్చిన ప్రయాణికులు, ఇప్పుడు మంచి క్వాలిటీ కలిగిన ఆహారాన్ని సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సుదూర ప్రయాణాల్లో ఈ సర్వీసు చాలా ఉపయోగపడుతుంది. ప్రయాణికులు కేవలం సాధారణ ఆహారం కాకుండా, ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక వంటకాలను కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. బిర్యానీ, వడా పావ్, లిట్టి చోఖా, అప్పం లాంటి స్థానిక వంటకాలను కూడా తెప్పించుకోవచ్చు. ixigo, ConfirmTkt, Swiggy కలిసి తీసుకొచ్చిన ఈ సర్వీసు వల్ల రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
Read Also: వందేభారత్ రైలులో షాకింగ్ ఘటన.. ఫుడ్ మానేసిన ప్రయాణికులు!