Vande Bharat Food Controversy: ఇండియాలో ప్రీమియం రైళ్లుగా గుర్తింపు తెచ్చుకున్న వందేభారత్ రైళ్లలో అందించే ఫుడ్ విషయంలో ప్రయాణీకుల నుంచి తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వందేభారత్ లో ప్రయాణిస్తుంటే, అందులో అందించే ఫుడ్ అత్యంత దారుణంగా ఉందని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ వందేభారత్ రైళ్లలో ప్రయాణీకులకు అందించిన ఫుడ్ లో ఏకంగా పురుగులు రావడంతో, కోచ్ లోని వాళ్లంతా ఫుడ్ తినడమే మానేశారు.
అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికుడికి అందించిన భోజనంలో పురుగు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే క్యాటరింగ్ సేవలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చర్యలు చేపట్టింది. సదరు క్యాటరింగ్ సంస్థపై రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది.
ఈ ఘటనకు సంబంధించి.. ప్రయాణికుడు తనకు వడ్డించిన ఆహారంలో పురుగు కనిపించిందని ఫోటోలు, వివరాలతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కోచ్ లోనే ఇలాంటి ఘటనలు మరికొన్ని జరిగాయని, దీంతో ప్రయాణికులు భోజనం చేయడం మానేసారని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాసేపట్లోనే ఈ పోస్టు వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే ఫుడ్ క్వాలిటీ, పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Found an insect in Vande Bharat train food (Ahmedabad → Mumbai). Atleast 2 such cases in my coach, everyone stopped eating after that.
Vendor: M/S Brandavan Food Products (part of RK Group).@fssaiindia @AshwiniVaishnaw @RailMinIndia @IRCTCofficial
Just one request to the… pic.twitter.com/rNrfVaNN5b
— Aditya Didwania (@adityadidwania) April 6, 2026
ఈ ఘటనపై IRCTC స్పందించింది. జరిగిన ఘటనపై క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. సదరు క్యాటరింగ్ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించడమే కాకుండా, వారి కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఫుడ్ తయారు చేసే కిచెన్ ను సీల్ చేసి, పూర్తిస్థాయి శుభ్రపరిచే చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
ఈ ఘటనతో ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. చాలా మంది వినియోగదారులు రైల్వే మరింత కఠినంగా తనిఖీలు చేయాలని సూచించారు. ముఖ్యంగా, ఫుడ్ క్వాలిటీ, గడువు తేదీలు, పరిశుభ్రత లాంటి అంశాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక ఇన్స్పెక్టర్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. రైల్వే కేవలం సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా, ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కొందరు రైలు ప్రయాణాల్లో బయట ఇచ్చే ఆహారం కంటే ఇంటి నుండి తీసుకెళ్లడం మంచిదన్నారు. మరికొందరు అవసరమైతే నమ్మకమైన ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా ఆర్డర్ చేసుకోవడం మంచిదంటున్నారు.
Read Also: అన్నవరం దగ్గర రైల్లో ప్రసవించిన గర్భిణీ, రైల్వే సిబ్బందిపై నెటిజన్ల ప్రశంసలు!