రుణాల ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం అప్పులు కట్టేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్ లైన్స్ (PIA)ను వేలం వేయబోతోంది. డిసెంబర్ 23న ఈ వేలంపాట నిర్వహించనుంది. ఈ డబ్బుతో IMF దగ్గర తీసుకున్న 7 బిలియన్ డాలర్ల అప్పును తీర్చాలని భావిస్తోంది. ఈ బిడ్డింగ్ కు అర్హత పొందిన నాలుగు కంపెనీలలో.. సైనిక నియంత్రణలో ఉన్నఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది.
PIA అమ్మకం ద్వారా భారీగా భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. “ఈ సంవత్సరం మేము 86 బిలియన్ల ప్రైవేటీకరణ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే PIA వేలం నిర్వహించబోతున్నాం” అని పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి ముహమ్మద్ అలీ వెల్లడించారు. PIA వాటాల విక్రయం గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ మొదటి ప్రధాన ప్రైవేటీకరణ కానుంది. ఈ అమ్మకానికి నాలుగు బిడ్డర్లు ముందస్తు అర్హత పొందాయి. లక్కీ సిమెంట్ కన్సార్టియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్టియం, ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్, ఎయిర్ బ్లూ లిమిటెడ్ వేలంలో పాల్గొననున్నాయి.
ఫౌజీ ఫెర్టిలైజర్ అనేది ఫౌజీ ఫౌండేషన్లో భాగం. ఇది పాకిస్తాన్లో అతిపెద్ద కార్పొరేట్ ప్లేయర్ లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ సంస్థ పాక్ సైన్యానికి అవసరమైన ఎక్యుప్ మెంట్స్ అందిస్తుంది. ఈ సంస్థ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు చెందినది. అయితే, ఆయన ఫౌజీ ఫౌండేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (CBDలు)లో ప్రత్యక్ష పదవిలో లేరు. ఫౌజీ ఫౌండేషన్ CBDలో భాగమైన క్వార్టర్ మాస్టర్ జనరల్ (QMG)ని ఆయన నియమించారు. పాకిస్తాన్ సైన్యాధిపతిగా ఉన్న మునీర్, కీలక పదవులకు నియామకాలు, జాతీయ భద్రత సహా సైనిక సంస్థాగత నియంత్రణ ద్వారా ఫౌజీ ఫౌండేషన్పై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తున్నారు.
పాకిస్తాన్ అర్థిక పరిస్థితి అత్యంత అధ్వాహ్నంగా ఉంది. రుణాలను తిరిగి చెల్లించడానికి రుణాలు తీసుకుంటుంది. ఇందుకోసం PIA ఉపసంహరణ చాలా కీలకం. 2023లో పాకిస్తాన్ తన అప్పులను చెల్లించడంలో ఎగవేసే ప్రయత్నం చేస్తోంది. అటు పాకిస్తాన్కు IMF 7 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు 2024లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1 బిలియన్ డాలర్లను వెంటనే ఇచ్చింది. మిగిలిన డబ్బును 3 సంవత్సరాల కాలంలో ఇవ్వాల్సి ఉంటుంది. పాకిస్తాన్ IMF దగ్గర ఐదవ అతిపెద్ద రుణగ్రహీతగా ఉంది. 1958 నుంచి ఈ దేశం IMF నుంచి 20కి పైగా రుణాలు తీసుకుంది.
ఒకప్పుడు పాకిస్తాన్ లో విలువైన ఆస్తిగా ఉన్న PIA ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. నష్టాల ఊబిలోకి చేరింది. అక్టోబర్ 2024లో, సాంకేతిక సమస్యల కారణంగా 17 విమానాలు నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య కేవలం 16కు తగ్గింది. ఆర్థిక ఇబ్బందుల తర్వాత, 2020లో PIA పూర్తి స్థాయి సంక్షోభంలోకి పడిపోయింది. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) జూన్ 2020లో యూరప్కు రాకుండా PIA విమానాలపై నిషేధం విధించింది. అధిక దిగుబడినిచ్చే మార్గాలకు విమానాలను నడిపే అవకాశం లేకపోవడం వల్ల సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. భద్రతా కారణాలతో UK, US కూడా PIA విమానాలపై నిషేధం విధించాయి. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ ప్రపంచంలోని పేలవమైన సేవలు అందించే సంస్థల్లో ఒకటిగా మారిపోయింది. చివరకు ప్రైవేట్ సంస్థ చేతికి వెళ్లబోతోంది.
Read Also: నీటిలో తేలుతుంది.. క్షిపణి దాడిని తట్టుకుంటుంది, రష్యా ప్రెసిడెంట్ కారు ప్రత్యేకతలు ఇవే!