IndiGo Flight: ముంబై నుంచి థాయ్లాండ్లోని క్రాబీకి బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విమానం గంటల తరబడి ఆలస్యం కావడం, చివరి నిమిషంలో పైలట్ తన డ్యూటీ సమయం ముగిసిందని ఫ్లైట్ నడపడానికి నిరాకరించడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలో ప్రయాణికులకు క్యాబిన్ క్రూ సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసలు ఏం జరిగింది ?
ముంబై నుంచి క్రాబీకి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 1085) గురువారం తెల్లవారుజామున 4:05 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే, వివిధ కారణాల వల్ల ఈ ఫ్లైట్ సుమారు మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైంది. ప్రయాణికులు అందరూ విమానంలోకి ఎక్కిన తర్వాత, పైలట్ తన డ్యూటీ టైం ముగిసిందని, విమానాన్ని టేకాఫ్ చేయలేనని చెప్పడంతో గందరగోళం మొదలైంది.
వైరల్ అయిన వీడియోలో.. ఒక ప్రయాణికుడు సిబ్బందిపై అరుస్తూ, “మేము చేసుకున్న ప్లాన్స్ పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించడం కనిపించింది. అంతే కాకుండా సదరు వ్యక్తి పైలట్ లోపల దాక్కున్నారని ఆరోపిస్తూ అత్యంత అసభ్య పదజాలంతో సిబ్బందిని నిలదీశారు. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే.. ఒక ప్రయాణికుడు విమానం యొక్క ఎగ్జిట్ డోర్ను కాలితో తన్నడం కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది.
ఇండిగో వివరణ:
ఈ ఘటనపై స్పందించిన ఇండిగో ప్రతినిధి, విమానం ఆలస్యానికి పలు కారణాలు ఉన్నాయని తెలిపారు. “ఇన్ కమింగ్ విమానం ఆలస్యంగా రావడం, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ, విమాన సిబ్బంది పని వేళల పరిమితి దాటిపోవడం వల్ల ఈ జాప్యం జరిగింది” అని వివరించారు.
విమానంలో ఉన్న సమయంలో ఇద్దరు ప్రయాణికులు అత్యంత అనుచితంగా ప్రవర్తించారని, వారిని ‘అన్రూలీ ప్యాసింజర్స్’ గా ప్రకటించినట్లు ఎయిర్లైన్ తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం, వారిని విమానం నుంచి దించి భద్రతా సంస్థలకు అప్పగించామని, దీనివల్ల విమానం మరింత ఆలస్యమైందని పేర్కొంది. ఆలస్యం అయిన సమయంలో ప్రయాణికులకు భోజనం, ఇతర రిఫ్రెష్మెంట్స్ అందించినట్లు సంస్థ వెల్లడించింది.
చివరికి.. ఉదయం 10 గంటలకు క్రాబీలో ల్యాండ్ కావాల్సిన ఈ విమానం, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో గమ్యస్థానానికి చేరుకుంది. గత నెలలో కూడా ఇండిగో విమానాల్లో పలు సమస్యలను ఎదర్కొన్న విషయం తెలిసిందే. విమానయాన నిబంధనల ప్రకారం, పైలట్లు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు విమానాన్ని నడపకూడదు. ఇది ప్రయాణికుల భద్రత కోసమే అయినప్పటికీ, ముందస్తు సమాచారం లేకుండా విమానంలో కూర్చున్న తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.