Surat Flyover Accident: చైనా మాంజా సామాన్య ప్రజల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ప్రభుత్వాలు ఈ దారంపై కఠిన నిషేధం విధించినప్పటికీ, దొంగచాటుగా సాగుతున్న విక్రయాలు పండుగ వేళ ఎన్నో ఇళ్లను విషాదంలో ముంచుతున్నాయి. తాజాగా గుజరాత్లోని జరిగిన ఘోర ప్రమాదం దీనికి నిదర్శనం. ఫ్లైఓవర్పై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. అడ్డంగా వచ్చిన మాంజాను తప్పించుకోబోయి 70 అడుగుల ఎత్తు నుండి కింద పడి మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
గుజరాత్లోని సూరత్ నగరంలో సంక్రాంతి పండుగ వేళ అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. గాలిపటాల మాంజా ఒక నిండు ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని మృత్యుఒడికి చేర్చింది. పశ్చిమ బెంగాల్కు చెందిన రెహాన్ షేక్ (35) సూరత్లోని ఒక జ్యువెలరీ యూనిట్లో పనిచేసేవారు. సంక్రాంతి సెలవు కావడంతో తన భార్య రెహానా, 10 ఏళ్ల కుమార్తె ఆయేషాతో కలిసి బుధవారం సాయంత్రం బైక్పై బయటకు వెళ్లారు. అడాజన్ ప్రాంతంలోని చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ (జిలానీ బ్రిడ్జ్) పై ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా గాలిపటం దారం (మాంజా) రెహాన్ మెడకు చుట్టుకుంది.
ఒక చేతితో ఆ దారాన్ని తొలగించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురూ సుమారు 70 అడుగుల ఎత్తు ఉన్న ఫ్లైఓవర్ నుండి కింద పడిపోయారు. రెహాన్, కుమార్తె ఆయేషా అక్కడికక్కడే మృతి చెందారు. కింద పార్క్ చేసి ఉన్న ఒక ఆటోరిక్షాపై పడిన రెహానా తీవ్ర గాయాలతో బయటపడినప్పటికీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన గుజరాత్ పోలీసులు.. సూరత్, అహ్మదాబాద్, వడోదర నగరాల్లో మాంజా విక్రయిస్తున్న వందలాది మందిపై కేసులు నమోదు చేశారు. వీటిని కేవలం జరిమానాతో వదలకుండా, ‘Causing death by negligence’ (మరణానికి కారణం కావడం) వంటి కఠిన సెక్షన్ల కింద విచారిస్తున్నారు.
ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు సూరత్ పోలీసులు మరియు మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారుల మెడకు మాంజా తగలకుండా, ఫ్లైఓవర్లపై ఉండే ఎలక్ట్రిక్ పోల్స్ మధ్య అడ్డంగా ఇనుప వైర్లను కట్టారు. గాలిపటం దారాలు కిందకు రాకుండా ఈ వైర్లు అడ్డుకుంటాయి.
ఈ ఘటనలు కేవలం గుజరాత్లోనే కాదు, ఈ సంక్రాంతి సీజన్లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా చైనా మాంజా వల్ల గొంతులు తెగి మరణాలు సంభవించాయి. అప్రమత్తత లేని క్షణకాలం ఆనందం, ఇతరుల జీవితాలను శాశ్వతంగా చిదిమేస్తోంది.
Read Also: చైనా మాంజాతో యమపాశం.. అమాయకుల ప్రాణాలతో చెలగాటం వద్దు.. సజ్జనార్ ఆవేదన!