Consumer Commission Fines RedBus: బస్ బయలుదేరడానికి కేవలం 17 నిమిషాల ముందు ప్రయాణికుడి టికెట్ క్యాన్సిల్ చేసిన ఘటనపై వినియోగదారుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ ఆన్ లైన్ టికెటింగ్ సంస్థ రెడ్ బస్, బస్ ఆపరేటర్ తో కలిసి ప్రయాణికుడికి రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. టికెట్ బుకింగ్ కన్ఫార్మ్ చేసిన తర్వాత సర్వీస్ అందించకపోవడం వినియోగదారుడి హక్కుల ఉల్లంఘన అని కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఘటన 2023 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది.
ఫిర్యాదుదారుడు జయంత్ పాటియాల్ పాలంపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రెడ్ బస్ యాప్ ద్వారా భర్మణి ట్రావెల్స్ బస్సులో రూ.600 చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బస్సు రాత్రి 10:15 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ఆయన 20 నుంచి 30 నిమిషాల ముందే బోర్డింగ్ పాయింట్ కు చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత బస్ ఆపరేటర్ ను సంప్రదించగా, ఆ సమయానికి ఎలాంటి బస్సు లేదని, ఆ రోజు చివరి బస్సు రాత్రి 8 గంటలకే వెళ్లిపోయిందన్నారు. దీంతో ప్రయాణికుడు తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. వెంటనే రెడ్ బస్ కస్టమర్ కేర్ ను సంప్రదించగా, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొద్ది సేపటికే, రాత్రి 9:58 గంటలకు, అంటే బస్సు బయలుదేరడానికి కేవలం 17 నిమిషాల ముందు, అతని టికెట్ క్యాన్సిల్ చేసినట్లు, ఆయన డబ్బును రీఫండ్ చేయనున్నట్లు మెసేజ్ వచ్చింది.
అప్పటికే ప్రత్యామ్నాయ బస్సు లేకపోవడంతో, అత్యవసరంగా ఢిల్లీ చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని సమీప విమానాశ్రయానికి వెళ్లి, మరుసటి రోజు ఉదయం బయలుదేరే విమానానికి చివరి నిమిషంలో ఎక్కువ ధర పెట్టి టికెట్ కొనుగోలు చేశారు. అదనపు ఖర్చు, మానసిక వేదన, ఎదురైన ఇబ్బందుల కారణంగా ఆయన జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా రెడ్బస్ తమ వాదనను వినిపించింది. తాము కేవలం ప్రయాణికులను బస్ ఆపరేటర్లతో అనుసంధానించే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ మాత్రమేనని, బస్సుల షెడ్యూళ్లు, మెయింటెనెన్స్ పై తమకు నియంత్రణ ఉండదని తెలిపింది. అలాగే టికెట్ మొత్తంలో రూ.585 బ్యాంక్ ఖాతాకు, రూ.60 రెడ్ బస్ వాలెట్ కు రీఫండ్ చేసినట్లు, అదనంగా టికెట్ ధరకు రెట్టింపు మొత్తాన్ని కూడా చెల్లించేందుకు సిద్ధమయ్యామని చెప్పింది.
అయితే కమిషన్ రెడ్ బస్ వాదనను అంగీకరించలేదు. డబ్బు స్వీకరించి, టికెట్ ను ధృవీకరించిన తర్వాత సర్వీసు అందించకపోతే కేవలం మధ్యవర్తులం అని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. వినియోగదారుడికి హామీ ఇచ్చిన సేవ అందుబాటులో లేకపోవడం సర్వీసులో లోపంగా పరిగణించబడుతుందని పేర్కొంది. మరోవైపు, బస్ ఆపరేటర్ భర్మణి ట్రావెల్స్ కమిషన్ ఎదుట హాజరుకాకపోవడంతో, వారి నిర్లక్ష్యం కూడా స్పష్టమైందని కమిషన్ అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారం బస్సు నడపకపోవడం, ప్రయాణికుడికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం కూడా తీవ్రమైన తప్పిదమని తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్బస్, భర్మణి ట్రావెల్స్ రెండూ ఉమ్మడిగా బాధ్యత వహించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే రీఫండ్ చేసిన మొత్తానికి అదనంగా, మానసిక వేదనకు రూ.5,000, కేసు ఖర్చులకు మరో రూ.5,000, మొత్తం రూ.10,000 నష్టపరిహారం 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. గడువులోగా చెల్లించకపోతే, ఫిర్యాదు దాఖలు చేసిన డేట్ నుంచి 9 శాతం వడ్డీతో మొత్తం చెల్లించాలని కూడా స్పష్టం చేసింది.
Read Also: కొత్త IRCTC వెబ్ సైట్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?