Thailand Visa Free for Indians: థాయిలాండ్కు వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. భారతీయులకు ప్రస్తుతం ఉన్న 30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీని రద్దు చేయాలన్న ప్రతిపాదనను థాయిలాండ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో భారతీయులు గతంలాగే వీసా లేకుండానే 30 రోజుల పాటు థాయిలాండ్ లో పర్యటించే అవకాశం కొనసాగనుంది.
కొద్ది నెలల క్రితం థాయిలాండ్ ప్రభుత్వం భారతీయులకు వీసా మినహాయింపును నిలిపివేయాలని ప్రాథమికంగా భావించింది. ఈ ప్రతిపాదనకు మే నెలలో క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది. అయితే, అది అమల్లోకి రాకముందే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మరోసారి రివ్యూ చేసింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి భారతీయ టూరిస్టులలో అనేక సందేహాలు తలెత్తాయి. వీసా నిబంధనలు మారబోతున్నాయనే వార్తలతో చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. మరికొందరు ఇతర దేశాలను ఎంచుకోవడం ప్రారంభించారు. దీంతో థాయిలాండ్ కు భారతదేశం నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారులు గుర్తించారు.
భారతీయ పర్యాటకులు థాయిలాండ్ పర్యాటక రంగానికి కీలకమైన మార్కెట్ గా ఉన్నారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భారతీయులు బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్, క్రాబీ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. భారతీయుల రాక తగ్గడంతో అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, స్థానిక వ్యాపారాలపై ప్రభావం పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని థాయిలాండ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. దేశ పర్యాటక రంగానికి నష్టం జరగకుండా ఉండేందుకు భారతీయులకు 30 రోజుల వీసా రహిత ప్రవేశాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో పర్యాటక రంగానికి మళ్లీ ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
థాయిలాండ్ పర్యాటక శాఖ మంత్రి సురసాక్ ఫంచరోయెన్వోరకుల్ ఈ వ్యవహారంపై స్పదించారు. వీసా మినహాయింపును రద్దు చేయాలనే ప్రతిపాదన అమల్లోకి రాకపోయినా, దాని గురించి వచ్చిన వార్తల వల్లే భారతీయ ప్రయాణికుల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. అదే భారతీయుల రాక తగ్గడానికి ప్రధాన కారణమైందని ఆయన వివరించారు. తాజా నిర్ణయంతో థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు మరోసారి శుభవార్త అందినట్లైంది. ముందుగా వీసా కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా, 30 రోజుల పాటు అక్కడ పర్యటించవచ్చు. ఫ్యామిలీ టూర్, హనీమూన్ ట్రిప్స్, షార్ట్ వెకేషన్లకు వెళ్లే వారికి మరింత సౌకర్యంగా మారనుంది.
పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడిన దేశాల్లో థాయిలాండ్ ఒకటి. అందువల్ల విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. భారతీయ పర్యాటకుల సంఖ్య పెరగడం థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగపడుతుండటంతో, ఈ వీసా రహిత ప్రవేశ విధానాన్ని కొనసాగించడం మంచిదని నిర్ణయించింది.
Read Also: ఏడు రంగుల కొండ.. ప్రకృతి సృష్టించిన అద్భుతం.. ఎలా ఏర్పడిందో తెలుసా?