Vikram-1 Launch: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో ఆధ్వర్యంలోనే సాగిన నింగి ప్రయాణాల్లోకి, ఇప్పుడు మన దేశీయ ప్రైవేట్ భాగస్వామ్యం పూర్తిస్థాయిలో అడుగుపెడుతోంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి దేశంలోనే తొలి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ‘ది మిషన్ ఆగమన్’ పేరుతో శనివారం ఉదయం 11:30 గంటలకు ‘విక్రమ్ -1’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
హైదరాబాద్ స్టార్టప్ అద్భుతం.. విక్రమ్-1
ఈ అద్భుత ప్రయోగానికి వెనుక మన తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అనే ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ఉంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో, ఇస్రో అండదండలతో ఈ విక్రమ్-1 రాకెట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉండే లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి సునాయాసంగా చేరవేయడం ఈ రాకెట్ ప్రధాన ప్రత్యేకత.
అంతరిక్ష వ్యర్థాలకు చెక్ పెట్టే ‘మిషన్ ఎంబ్రేస్’
ఈ ప్రయోగంలో అన్నింటికంటే ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం ‘మిషన్ ఎంబ్రేస్’ అనే ప్రత్యేక పేలోడ్. ‘కాస్మోస్ స్పేస్’ అనే సంస్థ అందించిన సాంకేతిక సహకారంతో ఈ పేలోడ్ను అభివృద్ధి చేశారు. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. అంతరిక్షంలో పేరుకుపోయిన ఉపగ్రహాల శిధిలాలను గుర్తించి వాటిని విజయవంతంగా తొలగించడం. అలాగే అంతరిక్షంలో పనిచేయకుండా తిరుగుతున్న పాత ఉపగ్రహాలను సురక్షితంగా పట్టుకుని, కక్ష్య నుంచి పక్కకు జరిపే వినూత్న సామర్థ్యం దీనికి ఉంది. ఈ కీలక పేలోడ్తో పాటు మరో మూడు చిన్న ఉపగ్రహాలు కూడా విక్రమ్-1 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయాణించనున్నాయి.
Also Read: రాజకీయ రంగు పులుముకుంటున్న కేసులు.. ఏపీలో ఏమిటీ ఈ పరిస్థితి?
ఇస్రో చరిత్రలో సరికొత్త మైలురాయి
కేంద్ర ప్రభుత్వం 2020లో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ చారిత్రక నిర్ణయమే నేడు దేశీయ స్పేస్ స్టార్టప్లలో సరికొత్త విప్లవానికి దారితీసింది. ఇస్రో కేవలం మార్గదర్శిగా ఉంటూ.. ఒక ప్రైవేట్ సంస్థ స్వయంగా రాకెట్ను తయారు చేసి అంతరిక్షంలోకి పంపించడం అనేది దేశ చరిత్రలోనే ఒక అపూర్వ మైలురాయి. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆశిస్తూ, యావత్ భారతావని ఇప్పుడు శ్రీహరికోట వైపు ఆసక్తిగా చూస్తోంది.