Sabarimala Travel Advisory: కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ప్రస్తుతం తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరగడంతో పాటు రహదారులపై రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా ఈ సూచనలు జారీ చేశారు.
తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో.. ప్రస్తుతం కేరళలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని వెల్లడించింది. ముఖ్యంగా పంబ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. శబరిమల వెళ్లాలని భావిస్తున్న భక్తులు వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరం కాని ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిదన్నారు.
రుతుపవనాల ప్రభావంతో కేరళలో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారత వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు కూడా ప్రమాదకర ప్రాంతాలకు అవసరం లేకపోతే వెళ్లవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. తమిళనాడు నుంచి శబరిమలకు వెళ్లే భక్తులు ప్రయాణానికి ముందు తాజా వాతావరణ సమాచారం తప్పనిసరిగా తెలుసుకోవాలని, కేరళ ప్రభుత్వం విడుదల చేసే సూచనలను పాటించాలని అధికారులు కోరారు.
భక్తుల భద్రతే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్షాలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే యాత్రను కొనసాగించాలని సూచించింది. ప్రకృతి విపత్తుల సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం దేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. పెరియార్ టైగర్ రిజర్వ్ లోని కొండపై ఈ ఆలయం ఉంది. శబరిమల ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉండదు. ప్రధానంగా మండల పూజా కాలం, మకరవిళక్కు ఉత్సవం సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అలాగే ప్రతి మలయాళ నెల ప్రారంభంలోని కొన్ని రోజులు, విషు వంటి ప్రత్యేక పర్వదినాల్లో కూడా ఆలయం తెరిచి ఉంటుంది. ఇక ప్రస్తుత వర్షాల నేపథ్యంలో భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.
Read Also: ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?