Unusual Science Experiment: శాస్తవేత్తలు నిరంతరం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని మరికొన్ని ఆసక్తిని కలిగిస్తాయి. అలాగే, స్విట్జర్లాండ్కు చెందిన పరిశోధకులు చేసిన ఓ ప్రయోగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి మట్టి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే సాధారణంగా శాస్త్రవేత్తలు చాలా రకాల పరీక్షలు చేస్తుంటారు. కానీ, స్విట్జర్లాండ్కు చెందిన పరిశోధకులు మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. నేల నాణ్యతను అంచనా వేసేందుకు ఏకంగా కాటన్ అండర్వేర్లను మట్టిలో పాతిపెట్టారు. వినడానికి వింతగా అనిపించిన ఈ ప్రయోగాన్ని.. యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్, అగ్రోస్కోప్కు చెందిన పరిశోధకులు మార్సెల్ వాన్ డెర్ హైడెన్ నేతృత్వంలో చేపట్టారు. ఇందులో దాదాపు 1,000 మంది వాలంటీర్లు కూడా భాగస్వాములయ్యారు. స్విట్జర్లాండ్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తోటలు, పొలాలు, గడ్డి మైదానాల్లో సుమారు 2,000 కాటన్ అండర్వేర్లను భూమిలో పాతిపెట్టారు.
ఈ ప్రయోగానికి కాటన్ దుస్తులను ఎంచుకోవడానికి కారణం వాటిలో ఉండే సెల్యులోజ్. ఇది మట్టిలోని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవులకు ముఖ్యమైన ఆహార వనరు. నేలలో జీవక్రియ ఎంత ఎక్కువగా ఉంటే.. కాటన్ కూడా అంత వేగంగా కుళ్లిపోతుంది. అందుకే, రెండు నెలల తర్వాత ఆ అండర్వేర్లను బయటకు తీసి వాటి పరిస్థితిని పరిశీలించారు. పూర్తిగా, ఎక్కువగా చిరిగిపోయిన అండర్వేర్ కనిపిస్తే.. ఆ నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు చురుగ్గా ఉన్నట్లు అర్థం చేసుకున్నారు. అదే దుస్తులు పెద్దగా మార్పు లేకుండా కనిపిస్తే.. అక్కడ నేల జీవశక్తి తక్కువగా ఉండే అవకాశం ఉందని గుర్తించారు.
ఈ ప్రయోగంలో ఆసక్తికరమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఇళ్లకు సంబంధించిన ప్రైవేట్ గార్డెన్లలో పాతిపెట్టిన అండర్వేర్లు వేగంగా కుళ్లిపోయాయి. వాటిలో దాదాపు 58 శాతం వరకు క్షీణించినట్లు పరిశోధకులు గుర్తించారు. మరోవైపు, రసాయనాలు ఎక్కువగా ఉపయోగించే లాన్లు, కొన్ని వ్యవసాయ భూముల్లో కాటన్ అంత వేగంగా కుళ్లిపోలేదు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నేలలోని జీవక్రియ, సూక్ష్మజీవుల చురుకుదనం మధ్య తేడాలు ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు.
ఈ ఆలోచన ఆధారంగా పరిశోధకులు మట్టి జీవశక్తిని సులభంగా అర్థం చేసుకునేందుకు ‘అండర్ప్యాంట్స్ ఇండెక్స్’ అనే పద్ధతిని ప్రతిపాదించారు. పెద్ద ఎత్తున శాస్త్రీయ పరికరాలు ఉపయోగించకుండా.. సాధారణ కాటన్ వస్త్రం ఎంతవరకు కుళ్లిపోయిందో గమనించడం ద్వారా నేల పరిస్థితిపై ఒక ప్రాథమిక అంచనా పొందే అవకాశం ఉన్నట్లు తేల్చారు. అయితే, ఇది మట్టి నాణ్యతను కొలిచే అన్ని శాస్త్రీయ పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదు. నేల ఆరోగ్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రజలకు సులభంగా వివరించే ఒక ఆసక్తికరమైన పద్ధతిగా దీన్ని చూడాలి.
ఈ ప్రయోగంలో మరో ప్రత్యేకత ప్రజల భాగస్వామ్యం. సాధారణంగా శాస్త్రీయ పరిశోధనలు ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలకే పరిమితమవుతాయి. కానీ, ఈసారి వేలాది కాటన్ అండర్వేర్లను వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టడం ద్వారా సాధారణ ప్రజలను కూడా పరిశోధనలో భాగం చేశారు. మట్టి ఆరోగ్యం, నేలలోని జీవవైవిధ్యం ఎంత ముఖ్యమో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేయడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. విచిత్రంగా కనిపించిన ఈ ఆలోచన చివరకు శాస్త్రీయంగా ఉపయోగకరమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ వినూత్న పరిశోధనకు 2026 ఐజీ నోబెల్ ప్రైజ్ కూడా లభించింది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!