India’s 320 kmph Bullet Train: దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు అయిన.. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే, రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ప్రస్తుతం గుజరాత్ లోని సూరత్ సమీపంలోని వక్తానా గ్రామంలో వయాడక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణంలో ప్రత్యేక టెక్నాలజీ వాడుతున్నట్లు ఇంజనీర్లు వెల్లడించారు. ఇంతకీ ఆ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణంలో సిమెంట్ ఆస్ఫాల్ట్ మోర్టార్(CAM) అనే ప్రత్యేక పదార్థాన్ని ఉపయోగిస్తున్నట్లు ప్రాజెక్టు ఇంజినీర్లు వెల్లడించారు. ఇది ట్రాక్ స్లాబ్, ట్రాక్ బెడ్ మధ్య కుషన్ లా పని చేస్తుంది. రైలు అధిక వేగంతో ప్రయాణించినప్పుడు వచ్చే ప్రకంపనలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మోర్టార్ ను ప్రత్యేక యంత్రంతో ట్రాక్ కింద ఇంజెక్ట్ చేస్తారు. జపాన్ నుంచి తెచ్చిన ఈ యంత్రాన్ని భారత్ లో తొలిసారిగా ఉపయోగిస్తున్నారు.
CAM తయారీలో సిమెంట్, ఇసుక, నీరు, తారు, పాలిమర్ ఎమల్షన్ లాంటి మొత్తం తొమ్మిది రకాల పదార్థాలు ఉంటాయి. వీటిలో కొన్ని మనదేశంలోనే లభిస్తుండగా, మరికొన్ని జపాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇందులో ఉపయోగించే ఒక ప్రత్యేక పదార్థం గురించి పూర్తి సమాచారం జపాన్ నిపుణులు వెల్లడించలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఆ పదార్థం వల్లే ట్రాక్ ఎక్కువ స్థిరత్వాన్ని పొందుతుందన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఐఐటీ ఖరగ్పూర్ పరిశోధకులు కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపు 508 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కారిడార్కు సుమారు రూ.1.98 లక్షల కోట్ల వ్యయం అవుతోంది. ఇది దేశంలో నిర్మించనున్న మొత్తం ఎనిమిది హైస్పీడ్ రైలు మార్గాల్లో మొదటిది. భవిష్యత్తులో మరో 4,000 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టులో జపాన్ కీలక భాగస్వామిగా ఉంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) రుణ సాయం చేస్తోంది. జపాన్ నిపుణులు భారత ఇంజనీర్లకు శిక్షణ కూడా ఇస్తున్నారు. తొలుత జపాన్కు చెందిన షింకన్సెన్ బుల్లెట్ రైళ్లను భారత్లో నడపాలని నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం భారత్ కూడా స్వదేశీ బుల్లెట్ రైళ్ల తయారీపై దృష్టి పెడుతోంది. బెంగళూరులోని BEML ప్లాంట్లో దేశీయ హైస్పీడ్ రైళ్ల తయారీ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 2029 నాటికి మొత్తం బుల్లెట్ రైలు కారిడార్ను ప్రారంభించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.
Read Also: ఇండియన్ బుల్లెట్ ట్రైన్ రెడీ.. గంటకు స్పీడ్ ఎంతో తెలుసా?