IRCTC Big Update: భారతీయ రైల్వే ప్రయాణికులకు త్వరలో స్మార్ట్ టికెట్ బుకింగ్ విధానం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అనే టెన్షన్ కు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ కొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వెయిటింగ్ టికెట్ కన్ఫర్మేషన్ అవకాశాలను మరింత కచ్చితంగా అంచనా వేసే కొత్త సిస్టమ్ ను రైల్వే సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ 1986లో ప్రారంభమైంది. అప్పట్లో ఉన్న ప్రయాణికుల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు రైల్వే టికెట్ బుకింగ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సరికొత్త రిజర్వేషన్ సిస్టమ్ను రూపొందిస్తున్నారు. ఈ అప్గ్రేడ్ పనులను దశలవారీగా ఆగస్టు నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త వ్యవస్థలో AI ఆధారిత వెయిటింగ్ టికెట్ అంచనా విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ప్రయాణికులు తమ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో? లేదో? తెలుసుకోవడానికి ఇతర వెబ్ సైట్లపై ఆధారపడాల్సి వచ్చేది. వాటిలో కచ్చితత్వం కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు AI టెక్నాలజీ సహాయంతో ఈ అంచనాల కచ్చితత్వాన్ని 94 శాతానికి పెంచినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
కొత్త AI వ్యవస్థ బుకింగ్ డేటా, టికెట్ క్యాన్సిలేషన్స్, రూట్ డిమాండ్, సీజనల్ ట్రావెల్ ట్రెండ్స్ లాంటి విషయాలను విశ్లేషించి కన్ఫర్మేషన్ అవకాశాలను అంచనా వేస్తుంది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసే సమయంలోనే తమకు సీటు దొరికే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పండుగలు, సెలవులు, అత్యవసర ప్రయాణాల సమయంలో ఎంతో ఉపయోగపడనుంది.
ప్రస్తుతం భారతీయ రైల్వేలో సుమారు 88 శాతం టికెట్ బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ సేవలను మరింత మెరుగుపరచడంపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. తాజా మార్పులతో చివరి నిమిషం వరకు వెయిటింగ్ క్లియర్ అవుతుందా? లేదా? అనే ఆందోళన కూడా తగ్గే అవకాశం ఉంది.
అటు రైల్ వన్ యాప్లో కూడా AI కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే కోట్ల సంఖ్యలో డౌన్ లోడ్ లు సాధించిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు టికెట్ బుకింగ్, రద్దు, లైవ్ ట్రైన్ స్టేటస్, ప్లాట్ఫారమ్ నంబర్లు, కోచ్ పొజిషన్ లాంటి సర్వీసులను పొందుతున్నారు. భవిష్యత్తులో AI ఆధారిత స్మార్ట్ సిఫార్సులు, రియల్ టైమ్ అప్ డేట్లు, మెరుగైన టికెట్ మెయింటెనెన్స్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. రైల్ మదద్ సర్వీసులు, సీటు దగ్గరికే ఫుడ్ డెలివరీ లాంటి సదుపాయాలు కూడా ఈ యాప్ తో పొందే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే.
Read Also: 320 కి.మీ వేగంతో బుల్లెట్ రైలు పరుగులు.. ట్రాక్ ల నిర్మాణంలో జపాన్ సీక్రెట్ టెక్నాలజీ వినియోగం!