South Central Railway: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని రైళ్ల కదలికలు సజావుగా సాగేలా ట్రాక్లను బలోపేతం చేయాలని అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సూచించారు. అవసరమైన చోట ట్రాక్లపై క్రమం తప్పకుండా భద్రతా తనిఖీలు చేపట్టాలని సూచించారు. బ్యాలస్ట్ ఫిల్లింగ్ ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత నేపథ్యంతో రైల్వే భద్రతా చర్యలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో వివరణాత్మక సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా జోన్ చేపడుతున్న జాగ్రత్తలను సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ వేసవిలో రైళ్లలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జోన్ నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్ను కూడా సమీక్షించారు.
Also Read: Vi Annual Plans 2026: వీఐ వార్షిక ప్లాన్స్.. రోజుకి 2GB డేటా, ఫ్రీ ఓటీటీ.. ఇవి చాలా చీప్ గురు!
నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాలలో భద్రతా మార్గదర్శకాలు, జాగ్రత్తలను పాటించాలని నొక్కి చెప్పారు. పనులు పూర్తయిన తర్వాత పని ప్రదేశాలలో ఎటువంటి నిర్మాణ సామగ్రి మిగిలి ఉండకుండా చూసుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనరల్ మేనేజర్ ప్రైవేట్ సైడింగ్లు, గూడ్స్ షెడ్ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, ప్రధాన విభాగాధిపతులతో పాటు పాల్గొన్నారు.