South Coast Railway Zone Operations: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిని భారీగా కుదిస్తూ రైల్వే శాఖ కొత్త నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జూన్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న కొన్ని కీలక డివిజన్లు కొత్త జోన్ లోకి మారనున్నాయి.
ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ లాంటి ప్రధాన డివిజన్లు ఉండేవి. అయితే, తాజా రీ ఆర్గనైజేషన్ తర్వాత ఇవన్నీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోకి వెళ్తాయి. ఇకపై దక్షిణ మధ్య రైల్వే పరిధి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకే పరిమితం కానుంది. రైల్వే శాఖ తాజా ప్రతిపాదనల ప్రకారం జోన్ పరిధిలోని ట్రాక్ పొడవు కూడా భారీగా తగ్గనుంది. ప్రస్తుతం 6,637 ట్రాక్ కిలోమీటర్లుగా ఉన్న పరిధి, కొత్త మార్పుల తర్వాత 3,589 ట్రాక్ కిలో మీటర్లకు తగ్గుతుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిపాలనలో పెద్ద మార్పు చోటుచేసుకోనుంది.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు కొత్త విశాఖపట్నం డివిజన్ కూడా ఉండనుంది. వాల్తేరు డివిజన్ స్థానంలో విశాఖపట్నం డివిజన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నాలుగు డివిజన్లతో కొత్త జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
ఇక డివిజన్ల సరిహద్దుల్లో కూడా మార్పులు చేశారు. గుంటూరు డివిజన్ పరిధిలో ఉన్న పగిడిపల్లి–విష్ణుపురం–జాన్ పహాడ్ సెక్షన్ ను సికింద్రాబాద్ డివిజన్లో విలీనం చేస్తున్నారు. అలాగే, గుంతకల్ డివిజన్ పరిధిలోని రాయచూరు–వాడి రైల్వే సెక్షన్ కూడా సికింద్రాబాద్ డివిజ న్కు బదిలీ కానుంది. దీంతో సికింద్రాబాద్ డివిజన్ పరిధి మరో 204 కిలోమీటర్ల మేర పెరుగుతుంది. ఈ మార్పుల వల్ల సికింద్రాబాద్ డివిజన్పై పని భారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రైళ్ల రాకపోకలు, సిగ్నలింగ్ సమన్వయం, ఆపరేషనల్ మేనేజ్ మెంట్ వంటి అంశాల్లో అదనపు ఒత్తిడి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇక కొత్త జోన్ కోసం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. ఇప్పటికే జనరల్ మేనేజర్, ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వంటి కీలక పోస్టులకు అధికారులను నియమించారు. వారు విధుల్లో కూడా చేరారు. అదేవిధంగా కొత్త జోన్ నిర్వహణ కోసం రైల్వే బోర్డు 128 గెజిటెడ్ పోస్టులు, 1,100 నాన్-గెజిటెడ్ పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో చాలావరకు దక్షిణ మధ్య రైల్వే నుంచి కొత్త జోన్కు బదిలీ కానున్నాయి. రైల్వే శాఖ అధికారులు ఇప్పటికే రెండు జోన్ల మధ్య కీలక సమావేశాలు నిర్వహించి పరిపాలనా అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 1 నుంచి కొత్త జోన్ పూర్తిస్థాయిలో పని ప్రారంభించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ లో రైల్వే అభివృద్ధి మరింత వేగం అందుకుంటుందని అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక జోన్ రావడం వల్ల ఆపరేషన్స్ సులభం కావడంతో పాటు కొత్త రైళ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also: మన్ననూర్, సోమశిల మీదుగా బుల్లెట్ రైలు.. ఆ ప్రాజెక్టులో కీలక మార్పులు!