Gujarat ATS: జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదుల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. భారీ దాడులకు పథకాలు రచిస్తున్నారా అని అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా జైష్ ఏ మహ్మద్కు చెందిన ఐదుగురు టెర్రరిస్టులను గుజరాత్ ఏటీఎస్ బృందం అదుపులోకి తీసుకుంది. వీళ్ల కదలికలపై పక్కా సమాచారంతో మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.
దేశంలో బిగ్ ఎటాక్సే లక్ష్యంగా..
అంతకుముందు గుజరాత్ ఏటీఎస్ బృందం 8 మంది ఇదే జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. తాజా అరెస్టులతో ఈ నెట్వర్క్కు చెందిన టెర్రరిస్టుల అరెస్ట్ సంఖ్య 13కు చేరింది. అందరినీ.. ఉత్తర గుజరాత్లోని సిద్ధ్పూర్, దాని పరిసర ప్రాంతాల్లోనే అరెస్ట్ చేశారు. దేశంలో బిగ్ ఎటాక్సే లక్ష్యంగా ఈ ఉగ్రవాద మాడ్యూల్ కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ మొత్తం నెట్వర్క్కు మహ్మద్ అయూబ్, అమీన్ షేరాలు మాస్టర్మైండ్గా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
8 సార్లు పేలుళ్ల ట్రయల్స్..
ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను తయారు చేయడం కోసం గన్ పౌడర్తో పాటు ఇతర రసాయన పదార్థాలను కూడా తెప్పించినట్లు తేలింది. అంతేకాకుండా, నిర్మానుష్య ప్రాంతాల్లో వీరు ఇప్పటికే 7 నుంచి 8 సార్లు చిన్న తరహా పేలుళ్లు జరిపి ట్రయల్స్ కూడా నిర్వహించినట్లు గుర్తించారు. ఈ ఉగ్ర కుట్ర వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందనే కోణంలో ఏటీఎస్ బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది.
వీళ్ల టార్గెట్ గుజరాతేనా..
వీళ్ల టార్గెట్ కేవలం గుజరాతేనా లేకమరెక్కడైనా దాడులు చేసేందుకు ఇక్కడ వ్యూహాలు రచిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అలాగే ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు..? ఎక్కడున్నారు అన్నది కూడా తేలాల్సి ఉంది.
Also Read: ORR వద్ద ఘోర ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి!