Best Budget International Trips: విదేశీ ప్రయాణాలు చేయాలనే లక్షల రూపాయలు ఖర్చవుతాయని చాలా మంది భావిస్తారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. తక్కువ ఖర్చుతో హ్యాపీగా పలు దేశాలను చుట్టేసి రావచ్చు. ఈ ఆగస్టులో ఢిల్లీ నుంచి కొన్ని అందమైన దేశాలకు కేవలం రూ.23 వేలలోపే రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్లు లభిస్తున్నాయి. అంతేకాదు, భారతీయులకు వీసా అవసరం లేకుండా వెళ్లే అవకాశం కూడా ఉండటంతో ఈ దేశాలు ఇప్పుడు ట్రావెల్ లవర్స్ ను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆ దేశాలు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ బడ్జెట్ లో విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారికి నేపాల్ బెస్ట్ ఆప్షన్. ఆగస్టులో అక్కడ వర్షాలు పడుతున్నప్పటికీ.. కాఠ్మండూ సిటీ ప్రశాంతమైన వాతావరణంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. వర్షం మధ్యలో దొరికే విరామ సమయంలో కాఠ్మండూ దర్బార్ స్క్వేర్, పటాన్ దర్బార్ స్క్వేర్, బౌద్ధనాథ్ స్థూపం లాంటి చారిత్రక ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది. కేఫ్ లలో కూర్చొని అక్కడి స్థానిక వాతావరణాన్ని కూడా ఆస్వాదించొచ్చు. అడ్వెంచర్ ఇష్టమైతే అప్పర్ ముస్తాంగ్, డోల్పో ప్రాంతాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉండటంతో ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు 17 నుంచి 19 వరకు జరిగే యార్టుంగ్ గుర్రపు పందాలు కూడా ఆకట్టుకుంటాయి. ఢిల్లీ-కాఠ్మండూ రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీ సుమారు రూ.15,284 ఉంటుంది. భారతీయులకు వీసా అవసరం లేదు.
సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, టేస్టీ ఫుడ్ ఇష్టపడేవారికి మలేషియా చాలా బాగా నచ్చుతుంది. ఆగస్టులో దేశంలోని తూర్పు తీర ప్రాంతాల్లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పెర్హెంటియన్, రెడాంగ్, టియోమాన్ దీవుల్లో స్నార్కెలింగ్, డైవింగ్ చేయడానికి ఇదే సరైన సమయం. కొన్ని ప్రాంతాల్లో సముద్ర తాబేళ్లను చూసే అవకాశం కూడా ఉంటుంది. కౌలాలంపూర్, పెనాంగ్, లాంగ్కావి ప్రాంతాల్లో అప్పుడప్పుడు వర్షాలు పడినా, ఉదయం వేళల్లో నగరాన్ని ప్రశాంతంగా చుట్టేయొచ్చు. బోర్నియోలోని అడవులు, నేషనల్ పార్కులు నేచర్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఢిల్లీ-కౌలాలంపూర్ రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీ సుమారు రూ.22,675 ఉంటుంది. భారతీయులకు వీసా అవసరం లేదు.
తక్కువ ఖర్చుతో బీచ్ హాలిడే ప్లాన్ చేస్తున్నవారికి థాయ్లాండ్ కూడా బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కో సముయ్, కో ఫాంగన్, కో టావో వంటి గల్ఫ్ దీవుల్లో ఆగస్టు నెలలో వాతావరణం బీచ్ ఎంజాయ్ మెంట్ కు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన సముద్రం, అందమైన తీరాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. బ్యాంకాక్ లో ఉదయం వేళల్లో వాట్ అరుణ్, గ్రాండ్ ప్యాలెస్ లాంటి ప్రసిద్ధ ఆలయాలను సందర్శించవచ్చు. మధ్యాహ్నం వర్షం పడితే షాపింగ్ మాల్స్, ఫుడ్ మార్కెట్లు చుట్టేయొచ్చు. ఉత్తర థాయ్ లాండ్లోని చియాంగ్ మాయ్ ప్రాంతం కూడా పచ్చని ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటుంది. ఢిల్లీ-బ్యాంకాక్ రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీ సుమారు రూ.22,765 ఉంటుంది. భారతీయులకు వీసా అవసరం లేదు.
Read Also: పచ్చని అడవులు.. గలగల పారే జలపాతాలు.. హైదరాబాద్ నుంచి అదిరిపోయే మాన్సూన్ ట్రిప్!