Loco Pilot: బీహార్ లోని ఠాకూర్ గంజ్ రైల్వే స్టేషన్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ లోకో పైలెట్ తన డ్యూటీ అయిపోయిందని చెప్పి.. రైలును స్టేషన్ లోనే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎటూ పాలుపోని స్థితిలో రైలులోనే ఉండిపోయారు. మార్చి 4న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
మాల్దా నుండి సిలిగుడి వెళ్తున్న DEMU (75719) ప్యాసింజర్ రైలు బీహార్లోని ఠాకూర్ గంజ్ (Thakurganj) రైల్వే స్టేషన్కు బుధవారం చేరుకుంది. మధ్యాహ్నం 2:52 గంటలకు ప్లాట్ఫారమ్ నంబర్ 1 పైకి వచ్చిన ఆ రైలు.. ఆ తర్వాత ముందుకు కదల్లేదు. పట్టాలపైనే నిలిచిపోయింది. అయితే రైలు స్టేషన్ కు రాగానే లోకో పైలట్ (రైలు డ్రైవర్) ఇంజిన్ నుంచి దిగి.. తాను రైలును ముందుకు నడపలేనని స్టేషన్ మాస్టర్ కు తేల్చి చెప్పారు.
తనకు నిర్దేశించిన 9 గంటల డ్యూటీ సమయం అయిపోయిందని.. బాగా అలిసిపోయి ఉన్నందున రైలును ముందుకు తీసుకెళ్లడం సాధ్యకాదని లోకో పైలెట్ చెప్పినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఆ రైలు గమ్యం చేరుకునే సమయానికి లోకో పైలెట్ డ్యూటీ కూడా అయిపోయేలా ఉన్నతాధికారులు అతడికి షిఫ్ట్ వేశారు. అయితే ఆ రైలు.. మార్గమధ్యలో సాంకేతిక సమస్యల వల్ల 3 గంటల ఆలస్యంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఠాకూర్ గంజ్ స్టేషన్ కు రాగానే డ్రైవర్ డ్యూటీ అయిపోయిందని దిగిపోయారు. మరొక లోకోపైలెట్ వచ్చేవరకు ప్రయాణికులు స్టేషన్ లోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
Also Read: Alappuzha Railway Station: రైలు కోచ్ కింద.. మానవ శరీర భాగాలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు!
రైల్వే సేఫ్టీ రూల్స్ ప్రకారం.. లోకో పైలట్లు అలసిపోయిన స్థితిలో రైలు నడపడం ప్రమాదకరం. అందుకే ఆయన ఓవర్ టైం (Overtime) చేయడానికి లోకో పైలెట్ నిరాకరించారని Northeast Frontier Railway పీఆర్వో కె.కె. శర్మ తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగుకుండా మరో లోకోపైలెట్ ను స్టేషన్ కు తరిలించామని చెప్పారు. అయితే మరో లోకోపైలెట్ వచ్చి డ్యూటీ ఎక్కేసరికి.. సా.6.52 గంటలు అయ్యింది. దీంతో దాదాపు 4 గంటల పాటు ప్రయాణికులు స్టేషన్ లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
Also Read: Iran-Israel War Report: ఎనిమిదో రోజుకు యుద్ధం.. వారంలో మాటల్లో చెప్పలేనంత విధ్వంసం!