Alappuzha Railway Station: కేరళలోని అలప్పుజ రైల్వే స్టేషన్ లో (Alappuzha Railway Station) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ లో ఆగి ఉన్న ధనాబాదా ఎక్స్ ప్రెస్ (Alappuzha–Dhanbad Express) రైలు కోచ్ కింద మానవ శరీర భాగాలు ఉండటం రైల్వే అధికారులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఈ విషయం తెలిసి స్టేషన్ లోని ప్రయాణికులు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ శరీర భాగాలు ఎవరివి? కోచ్ కిందకు ఎలా వచ్చాయి? అన్న కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అలప్పుజ రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అలప్పుజ – ధన్బాద్ ఎక్స్ప్రెస్ (13352) రైలు శుక్రవారం సాయంత్రం ఝార్ఖండ్ నుండి అలప్పుజ చేరుకుంది. శనివారం ఉదయం రైలును శుభ్రం చేస్తున్న సమయంలో S 5 కోచ్ కింద ఉన్న ఐరన్ బ్రాకెట్కు ఒక వ్యక్తి కుడి చేయి, కాలి వేలు ఇరుక్కుపోయి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న సిబ్బంది.. స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ శరీర భాగాలు ఎవరివి? ఎక్కడ ప్రమాదం జరిగింది? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ రైలు జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ప్రయాణిస్తుంది కాబట్టి ఆయా రాష్ట్రాల పోలీసులను కూడా అధికారులు సంప్రదిస్తున్నారు. గత రెండు రోజుల్లో ఆ మార్గంలో ఎక్కడైనా రైలు ప్రమాదాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయా అని తనిఖీ చేస్తున్నారు.
ప్రస్తుతం మానవ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. రైలు ప్రయాణించిన మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ శరీర భాగాలు కోచ్ కింద ఇరుక్కుపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలో కూడా ఇదే స్టేషన్లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: Iran Earthquake: యుద్ధంలో మునిగిన ఇరాన్పై.. ప్రకృతి కన్నెర్ర.. మరోసారి భూకంపం