250 Vande Bharat Sleeper Trains Planned: భారతీయ రైల్వేలో వందే భారత్ సేవలు మరింత విస్తరించబోతున్నాయి. ఇప్పటికే పగటి ప్రయాణాల్లో అందుబాటులో ఉన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఇప్పుడు సుదూర రాత్రి ప్రయాణాలకు కూడా సిద్ధమవుతోంది. ఇందుకోసం అధునాతన సౌకర్యాలతో కూడిన వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ వేగంగా కొనసాగుతోంది. 250కి పైగా స్లీపర్ రైలు సెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే ప్రణాళికలు రూపొందించింది.
2019లో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభమూంది. అప్పట్లో ప్రధానంగా పగటి ప్రయాణాల కోసం చైర్ కార్ రైలుగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సుదూర రాత్రి ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని స్లీపర్ వెర్షన్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే తొలి వందే భారత్ స్లీపర్ రైళ్లు గౌహతి-హౌరా మార్గంలో సేవలు ప్రారంభించాయి. మరో జత రైళ్లు ప్రస్తుతం ట్రయల్స్ లో ఉన్నాయి. అయితే, కొత్త రైళ్లను ఏయే మార్గాల్లో నడపాలన్నది రైల్వే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
వందే భారత్ స్లీపర్ ప్రాజెక్టులో పలు సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయి. BEML తొలి దశలో 10 రైలు సెట్లను తయారు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మరో 50 రైళ్లను తయారు చేయనుంది. అదే సమయంలో కైనెట్ రైల్వే సొల్యూషన్స్ 120 రైలు సెట్లను, టిటాగఢ్-బీహెచ్ఈఎల్ కన్సార్టియం మరో 80 రేక్లను తయారు చేయనుంది. ఈ ప్రణాళికలన్నీ పూర్తయితే మొత్తం 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైలు సెట్లు రైల్వేకు అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతం తయారవుతున్న 16 కోచ్ల స్లీపర్ రైలులో 11 ఏసీ 3 టైర్ కోచ్లు, నాలుగు ఏసీ 2 టైర్ కోచ్లు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. ICF తయారు చేయనున్న కొన్ని రైళ్లను 24 కోచ్లతో రూపొందిస్తున్నారు. వీటిలో ప్యాంట్రీ కార్ కూడా ఉండనుంది. సుదూర రాత్రి ప్రయాణాలకు ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా ఈ వెర్షన్ను రూపొందిస్తున్నారు.
వందే భారత్ స్లీపర్ రైలు డిజైన్ వేగం గంటకు 180 కిలోమీటర్లుగా ఉంది. అయితే వాస్తవ ప్రయాణ వేగం రైల్వే ట్రాక్, సిగ్నలింగ్, మౌలిక వసతులపై ఆధారపడి ఉంటుంది. అనుకూల మార్గాల్లో గంటకు 160 కిలోమీటర్ల వరకు వేగంతో నడిచే అవకాశం ఉంది. సాంప్రదాయ రైళ్ల మాదిరిగా ప్రత్యేక లోకోమోటివ్పై ఆధారపడకుండా, రైలు సెట్లోనే విద్యుత్ వ్యవస్థను పంపిణీ చేయడం వల్ల వేగంగా యాక్సిలరేషన్, బ్రేకింగ్ సాధ్యమవుతుంది.
ప్రయాణికుల సౌకర్యానికి స్లీపర్ వందే భారత్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. కుషన్డ్ బెర్త్లు, రీడింగ్ లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు, నైట్ లైటింగ్ వంటి సదుపాయాలు ఉంటాయి. కోచ్ల మధ్య పూర్తిగా మూసివేసిన గ్యాంగ్వేలు, ఆటోమేటిక్ ఇంటర్కనెక్టింగ్ డోర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేశారు. వందే భారత్ స్లీపర్లో ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులో షవర్ సదుపాయంతో పాటు వేడి నీటి సౌకర్యం కూడా ఉంటుంది. విమానాల్లో ఉపయోగించే విధానాన్ని పోలిన బయో వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాష్రూమ్ కూడా ఉంటుంది.
భద్రత విషయంలోనూ స్లీపర్ వందే భారత్లో ఆధునిక వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. అలాగే రీజెనరేటివ్ బ్రేకింగ్, సెంట్రలైజ్డ్ కోచ్ మానిటరింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి.
Read Also: ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!