Indian Railway: మధ్యప్రదేశ్ గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన జరిగింది. జనరల్ ట్రైన్ చెకింగ్స్ లో భాగంగా తనిఖీ చేస్తుండగా, ఒక్కసారిగా ఊహించని పరిస్థితి ఎదురయ్యింది. గ్వాలియర్ నుంచి ప్రయాగరాజ్ కు వెళ్లే గ్వాలియర్-ప్రయాగరాజ్ ఎక్స్ ప్రెస్ లో పెద్ద నాగుపాము కనిపించడంతో రైల్వే సిబ్బంది ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. ఆ తర్వాత దాన్ని బంధించి బయటకు తీసుకెళ్లారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఉదయం ప్లాట్ ఫారమ్ నంబర్ 3 దగ్గర రైలు బయలుదేరే ముందు కోచ్ అండ్ వ్యాగన్ సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనరల్ కోచ్ లో వాటర్ ట్యాంకులు, వాష్ బేసిన్లు సరిగ్గా పని చేస్తున్నాయా? లేదా? అని పరిశీలిస్తున్న సమయంలో వారికి ఏదో అసాధారణంగా అనిపించింది. వెంటనే పరిశీలించి చూడగా పెద్ద నాగుపాము కనిపించింది. ప్లాట్ ఫారమ్ సమీపంలో తవ్విన ప్రాంతం నుంచిపాము రైలులోకి ప్రవేశించినట్లు సిబ్బంది గమనించారు. ఇది అత్యంత విషపూరితమైన స్పెక్టాకిల్డ్ కోబ్రాగా గుర్తించారు. పాము కోచ్లోకి వెళ్లినట్లు కనిపించడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.
మొదట కోచ్ లో వెతికినా పాము కనిపించలేదు. దీంతో సిబ్బంది మరింత జాగ్రత్తగా తనిఖీ చేశారు. టార్చ్ ల సాయంతో వాష్ బేసిన్ల కింద పరిశీలించగా చిన్నగా కదులుతున్నట్లు కనిపించింది. నాగుపాము వాష్ బేసిన్ కింద ఉన్న ప్యానెల్ లో దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని రైల్వే అధికారులకు, రైల్వే రక్షణ దళం సిబ్బందికి సమాచారం అందించారు. అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా వాష్బేసిన్ కింద ఉన్న ప్యానెల్ ను తొలగించారు. ప్యానెల్ తెరవగానే పెద్ద నాగుపాము బయటకు రావడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నెమ్మదిగా కర్రల సాయంతో పామును కోచ్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం దానిని రైల్వే పట్టాల పక్కకు తీసుకెళ్లారు. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లగొట్టారు.
సిబ్బంది సమయానికి స్పందించకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని రైల్వే అధికారులు చెప్పారు. రైలు ప్రయాణం ప్రారంభమైన తర్వాత పాము ప్రయాణికుల మధ్యకు వచ్చి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్నారు. సి&డబ్ల్యూ సిబ్బంది అప్రమత్తత, ఫాస్ట్ యాక్షన్ తో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు ప్రశంసించారు. ఈ ఘటన కారణంగా రైల్వే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడలేదని చెప్పారు. అనంతరం రైలును పూర్తిగా తనిఖీ చేసి, ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ప్రయాణం కొనసాగించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారగా, రైల్వే సిబ్బంది చూపిన చాకచక్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.
Read Also: రెండింతల ఫైన్.. కట్టకపోతే జైల్.. ఇవాళ్టి నుంచి అమల్లోకి షాకింగ్ రూల్!