IRCTC Vandarshan Package: ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణులను దగ్గరగా చూడాలనుకునే వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. మహారాష్ట్ర అటవీ శాఖతో కలిసి ‘వన్ దర్శన్’ పేరుతో కొత్త జంగిల్ సఫారీ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ ద్వారా మహారాష్ట్రలోని ప్రముఖ పులుల అభయారణ్యాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఈజీగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా జూలై 29న ఈ ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించారు. ప్రయాణికులు వేర్వేరుగా రైలు టికెట్లు, హోటల్ గదులు, సఫారీ పర్మిట్లు, స్థానిక రవాణా కోసం బుకింగ్లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని సౌకర్యాలను ఒకే ప్యాకేజీలో అందిస్తున్నారు.
సాధారణంగా జంగిల్ సఫారీకి వెళ్లాలంటే ముందుగా చాలా ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా పులుల అభయారణ్యాల్లో సఫారీ అనుమతులు పొందడం కొన్నిసార్లు కష్టమవుతుంది. కానీ ‘వన్ దర్శన్’ ప్యాకేజీలో ఈ ఇబ్బందులు ఉండవు. రైలు ప్రయాణం నుంచి హోటల్ స్టే, ఫుడ్, లోకల్ స్టే, జంగిల్ సఫారీ వరకు అన్నింటినీ IRCTC ఒకే బుకింగ్లో అందిస్తుంది.
ఈ టూర్లో భాగంగా మహారాష్ట్రలోని ఐదు ప్రముఖ వన్యప్రాణి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. వాటిలో తాడోబా టైగర్ రిజర్వ్ ఒకటి. ఇక్కడ పులులు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బోర్ టైగర్ రిజర్వ్, నావేగావ్-నాగ్జీరా, ఉమ్రేడ్-కర్హండ్లా, టిపేశ్వర్ లాంటి ప్రాంతాలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. ప్రకృతి, వన్యప్రాణుల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఇవి మంచి అనుభూతిని అందిస్తాయి.
IRCTC రూపొందించిన ప్రతి టూర్ 4 రాత్రులు, 5 రోజుల వ్యవధితో ఉంటుంది. ఈ ప్రయాణం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి విదర్భ ఎక్స్ ప్రెస్ ద్వారా ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో ఇతర నగరాల నుంచి కూడా బోర్డింగ్ సౌకర్యాన్ని అందించే అవకాశాన్ని IRCTC పరిశీలిస్తోంది.
ప్రస్తుతం ఈ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ, టూర్ ఛార్జీలను ఇంకా వెల్లడించలేదు. బుకింగ్లు ప్రారంభించే సమయంలో పూర్తి ధరలు, ఇతర నిబంధనలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ జంగిల్ సఫారీ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునే వారు IRCTC టూరిజం పోర్టల్ ద్వారా మాత్రమే రిజర్వేషన్ చేసుకోవాలి. ఇతర వెబ్సైట్లు, ఏజెంట్ల ద్వారా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉండదని సంస్థ తెలిపింది. వన్యప్రాణి సంరక్షణతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని IRCTC వెల్లడించింది. అలాగే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యాటక రంగానికి కూడా ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. అడవిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, పులులు సహా అరుదైన వన్యప్రాణులను దగ్గరగా చూడాలనుకునే వారికి ‘వన్ దర్శన్’ ప్యాకేజీ మంచి అవకాశం కానుంది.
Read Also: ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి వందే భారత్ స్లీపర్ కోసం ఎంపీ లేఖ!