Vande Bharat Sleeper for Visakhapatnam: విశాఖపట్నం- బెంగళూరు నగరాలకు వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు ప్రారంభించాలని వైజాగ్ ఎంపీ శ్రీభారత్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాసి, ఉత్తరాంధ్ర ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీసులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ప్రతి రోజు వేలాది మంది ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఐటీ రంగానికి చెందిన వారు ఈ మార్గంలో తరచూ రాకపోకలు సాగిస్తున్నారు. అయితే వీరిలో చాలా మంది నేరుగా రైలు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు.
ఎంపీ శ్రీభారత్ లేఖలో కీలక విషయాలు వెల్లడించారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రోజూ దాదాపు 30 ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. ఈ సంఖ్యను బట్టి ఈ మార్గంలో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోందని ఆయన తెలిపారు. సాధారణంగా బస్సులు సాయంత్రం విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం బెంగళూరు చేరుకుంటాయని వివరించారు. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొస్తే, ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్నారు. రాత్రి సమయంలో ప్రయాణించి ఉదయం గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండటంతో సమయం కూడా ఆదా అవుతుందన్నారు.
ఈ రైలును తిరుపతి మీదుగా నడపాలని ఎంపీ భరత్ కోరారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రతి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి వెళ్తుంటారు. ప్రత్యేకంగా సెలవులు, పండుగలు, బ్రహ్మోత్సవాల సమయంలో ప్రయాణికుల రద్దీ మరింత పెరుగుతుంది. అలాంటి సమయంలో స్లీపర్ రైలు అందుబాటులో ఉంటే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభిస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రయాణ పరంగా పెద్ద ఊరట లభిస్తుందని శ్రీభారత్ తెలిపారు. దీంతో పాటు ఈ ప్రాంతాల మధ్య వ్యాపార, విద్యా, ఉపాధి అవకాశాలకు కూడా మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎంపీ చేసిన విజ్ఞప్తికి సంబంధించి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి రైల్వే మంత్రిత్వ శాఖకు పంపినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారిక ఆమోదం రావాల్సి ఉంది. వందే భారత్ స్లీపర్ రైళ్లపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, విశాఖపట్నం నుంచి తిరుపతి, బెంగళూరుకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎంపీ శ్రీభారత్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: హైదరాబాద్ మెట్రో ఎక్కాలంటే భయం.. ఢిల్లీ తరహాలో కోచ్ల సంఖ్య ఎందుకు పెంచడం లేదు?