President Murmu’s Special Train Journey: దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రయాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా రైలులో ప్రయాణించే సమయంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయి. సాధారణ ప్రయాణికుల రైళ్లతో పోలిస్తే, రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు ప్రత్యేక ప్రోటోకాల్ ప్రకారం నడుస్తుంది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో రైలు ప్రయాణం చేయడంతో ఈ ప్రత్యేక ఏర్పాట్లు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఒడిశా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భువనేశ్వర్ నుంచి బెర్హంపూర్ వరకు ప్రత్యేక రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణం సుమారు 170 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రెసిడెంట్ స్పెషల్ రైలును ఆమె ఎక్కారు. ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.
ఈ ప్రత్యేక రైలు ప్రయాణంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రపతి రైలు ముందు ఒక ఎస్కార్ట్ రైలు, వెనుక మరో ఎస్కార్ట్ రైలును నడిపించారు. దీంతో రాష్ట్రపతి రైలు మధ్యలో సురక్షితంగా ప్రయాణించారు. ఈ సమయంలో అదే మార్గంలో ఇతర రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్రపతి ప్రయాణానికి ముందుగానే ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి భువనేశ్వర్ కు చేరుకుంది. అనంతరం రైల్వే స్టేషన్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పోలీసులు, ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా భద్రతను పర్యవేక్షించారు. ప్లాట్ ఫారమ్లు పూర్తిగా భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లాయి. స్టేషన్ పరిసరాల్లో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు.
బెర్హంపూర్ చేరుకున్న తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో తప్తపాని ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పంథా నివాస్ను సందర్శించిన అనంతరం ప్రసిద్ధ వేడి నీటి బుగ్గను పరిశీలించారు. అనంతరం మా కంధుని దేవి ఆలయం, నీలకంఠేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్దకు వచ్చిన ప్రజలను రాష్ట్రపతి ఆప్యాయంగా పలకరించారు. పిల్లలు, విద్యార్థులతో మాట్లాడి వారికి చాక్లెట్లు కూడా పంపిణీ చేశారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో బస చేసి, మరుసటి రోజు అదే ప్రత్యేక రైలులో భువనేశ్వర్కు తిరిగి చేరుకున్నారు.
భారత రాష్ట్రపతులు రైలులో ప్రయాణించడం కొత్త విషయం కాదు. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తరచూ రైలు ప్రయాణాలు చేసేవారని రైల్వే రికార్డులు చెబుతున్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రెసిడెంట్ స్పెషల్ రైలులో తన స్వగ్రామాన్ని సందర్శించారు. ఇటీవల విమాన ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రపతి ముర్ము ఇప్పటికీ రైలును ఉపయోగిస్తున్నారు. ప్రతి ప్రయాణంలో భద్రత, ప్రోటోకాల్, రైల్వే సమన్వయం అత్యంత కచ్చితంగా అమలు చేయడం భారత రైల్వే ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
Read Also: ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. విశాఖ నుంచి వందే భారత్ స్లీపర్ కోసం ఎంపీ లేఖ!