దేశ వ్యాప్తంగా రవాణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రహదారులను విస్తరిస్తోంది. గత దశాబ్ద కాలంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఎక్స్ ప్రెస్ వేలు, హైవేలు నిర్మిస్తోంది. శరవేగంగా పనులను చేపడుతోంది. నిజానికి రోడ్ల గురించి మాట్లాడే సమయంలో హైవే, ఎక్స్ ప్రెస్ వే అని వింటూ ఉంటాం. అంతేకాదు, ప్రజలు తరచుగా హైవేలు, ఎక్స్ ప్రెస్వేలలో ప్రయాణిస్తున్నా, వాటి గురించి చాలా మందికి తెలియదు. ఇంతకీ హైవే, ఎక్స్ ప్రెస్వే మధ్య తేడా ఉంటి? రెండింటి మీద డ్రైవింగ్ రూల్స్ ఎలా ఉంటాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా, జాతీయ రహదారుల గురించి మాట్లాడుకుందాం. ఇవి ప్రధాన నగరాలు, రాష్ట్ర రాజధానులు, ఓడరేవులు, దేశ వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలను అనుసంధానించడానికి నిర్మించే విశాలమైన రోడ్లు. వాటి నిర్మాణం, నిర్వహణ.. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. వీటిని ప్రధానంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్మించి మెయింటెయిన్ చేస్తుంది. మన దేశంలో 200 కంటే ఎక్కువ జాతీయ రహదారులు ఉన్నాయి. మొత్తం 1.3 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్నాయి. ఈ రోడ్లు రెండు లేన్లు, నాలుగు లేన్లు, అంతకంటే ఎక్కువ లేన్లు ఉంటాయి. జాతీయ రహదారులపై గరిష్ట వేగ పరిమితి సాధారణంగా కార్లకు గంటకు 100 కి.మీ కాగా, టూ వీలర్స్ కు గంటకు 80 కి.మీ. ఉంటుంది. దేశంలోని అతి పొడవైన జాతీయ రహదారి జాతీయ రహదారి 44. ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 3,745 కి.మీ విస్తరించి ఉంది.
ఎక్స్ ప్రెస్ వే అనేది హైవే కంటే మరింత ఆధునిక ఆధునిక రహదారి. ఇది సాధారణంగా ఆరు నుంచి ఎనిమిది లేన్లను కలిగి ఉంటుంది. నియంత్రిత యాక్సెస్ ను కలిగి ఉంటుంది. అంటే వాహనాలు నిర్ణయించిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల నుంచి మాత్రమే ప్రవేశించి, బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మధ్యలో నేరుగా చిన్న రోడ్లు లేవు. ఈ రోడ్ల కారణంగా ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. ఎక్స్ ప్రెస్ వేలు సర్వీస్ లేన్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు, ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు లాంటి ఆధునిక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ రోడ్డు మీద కార్లకు గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కి.మీ వరకు ఉంటుంది. దేశంలోని చాలా ప్రధాన ఎక్స్ ప్రెస్ వేలపైకి బైక్లు, స్కూటర్లు నిషేధించబడ్డాయి. నిషేధిత ఎక్స్ ప్రెస్ వేపై ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్తే ట్రాఫిక్ పోలీసులు రూ.20,000 వరకు జరిమానా విధిస్తారు. వాహనాన్ని జప్తు చేసే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రధాన ఎక్స్ ప్రెస్ వేలలో ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే ముఖ్యమైనది. ఇది దాదాపు 302 కి.మీ పొడవు ఉంటుంది.
హైవే, ఎక్స్ ప్రెస్ వే మధ్య కీలకమైన తేడా యాక్సెస్ కంట్రోల్. జాతీయ రహదారులు ఒకదానికొకటి అనుసంధానించే అనేక చిన్న రహదారులు ఉంటాయి. ఎక్స్ ప్రెస్వేలు పరిమిత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను కలిగి ఉంటాయి. హైవేలతో పోలిస్తే, ఎక్స్ ప్రెస్ వేలు వెడల్పుగా ఉంటాయి. హై స్పీడ్ ప్రయాణం కోసం రూపొందించబడ్డాయి. సురక్షితమైనవి కూడా.
Read Also: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్, మార్చి 1 నుంచి ఆ యాప్ పని చేయడదట!