కావ్య రూంలో ఉన్న కషాయంలో పసరు మందు కలపాలని రేఖ, రుద్రాణి వెళ్తారు. అక్కడే రూంలో కనకం, కావ్య మాట్లాడుతూ ఉంటారు. వాళ్లు వెళ్లిపోయాక కలుపుదాం అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఇంద్రాదేవి వెళ్తుంది. ఏం కనకం అయిపోయిందా.. మీ తల్లీకూతుళ్ల సెంటిమెంట్ డ్రామా అని అడుగుతుంది. దీంతో కావ్య ఏంటి అమ్మమ్మ మా అమ్మ రాక రాక వచ్చింది. ఆ మాత్రం మంచి చెడ్డా ఉండదా ఏంటి..? అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి నువ్వు ఉన్న చోట చెడుకు తావు ఎక్కడుంటుందే మనవరాలా..? అంతా మంచే కదా..? అది తెలిసి కూడా కొంచెం గ్యాప్ దొరికితే చాలు కుళాయిలు తిప్పేస్తారు తల్లీకూతుళ్లు.. అనగానే.. మీకు తెలియంది ఏముందమ్మా.. నా బిడ్డ ఇన్నాళ్లు ఎన్ని ఆటంకాలను దాటిందో.. ఎన్ని ఒడిదుడుకులను చూసిందో మీకు తెలుసు కదా..? ఇప్పుడిప్పుడే కదా దాని మనసు కుదటపడింది. మీ అందరి కళ్లల్లో వెలుగు నిండింది.. అని చెప్పగానే..
ఇక అంతా వెలుగే కనకం.. నా మనవరాలే ఈ ఇంటికి దీపం అయితే ఇక వెలుగుకు లోటు ఎక్కడ ఉంది అంటుంది. ఇంతలో కిటికీలోంచి చూస్తున్న రేఖ మమ్మీ వీళ్ల సెంటిమెంట్ అయ్యేట్టు లేదు.. ఇప్పుడెలా..? అని అడగ్గానే.. దీంతో రుద్రాణి అదేనే సమస్యా సరే ఇప్పుడు కాదులే ఎవ్వరికీ డౌటు రాకుండా టైం చూసుకుని కలపాలి ఇప్పుడు వద్దు పద అంటూ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక కనకం సంతోషంగా అమ్మా మీరెన్ని చెప్పినా.. నా బిడ్డ గొప్పదనాన్ని ఎంత పొగిడినా..? ఇదంతా మీ చలవే..మీ అందరి మంచి మనసు వల్లే నా కూతురు ఇవాళ ఇలా ఉంది. దీనంతటికి కారణం మీరే అంటూ కనకం దండం పెడుతుంది. దీంతో ఇంద్రాదేవి.. కనకం ఇప్పుడు ఇలాంటి దండాలు పెట్టకు ఈ వయసులో నాకు అహంకారం వస్తే బాగోదు.. పదండి మరి టైం అవుతుంది అంటూ చెప్పగానే అందరూ కిందకు వెళ్తారు.
కావ్యను తీసుకుని కనకం, ఇందరాదేవి వస్తారు. అప్పును తీసుకుని ధాన్యలక్ష్మీ వస్తుంది. పంతులు రాజ్, కళ్యాణ్లను పిలిచి అయ్యా మీ మీ సహధర్మచారిణిలను మీరే స్వయంగా తీసుకెళ్లి కూర్చోబెట్టండి అని చెప్పగానే.. రాజ్, కళ్యాణ్ ఇద్దరూ వచ్చి అప్పు, కావ్యను కుర్చీలో కూర్చోబెడతారు. పంతులు.. అయ్యా అమ్మాయిల అత్తలు వచ్చి వారిని కొబ్బరి నీళ్లతో శుద్ది చేయండి అని చెప్పగానే.. అప్పు, కావ్య షాక్ అవుతారు.. ఏంటి ఇప్పుడు మమ్మల్ని కొబ్బరినీళ్లతో కడిగేస్తారా..? అని అప్పు అడగ్గానే.. అవును ఇప్పుడు ఇలాగే చేస్తారా…? అని కావ్య అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి శుద్ది చేయడం అంటే కడిగేయడమో అభిషేకం చేయడమో కాదే కొబ్బరినీళ్లతో కొద్దిగా చిలకరించడం అని చెప్తుంది. పంతులు సీమంతం కార్యక్రమం నిర్వహిస్తుంటే.. రుద్రాణి మెల్లగా కావ్య రూంలోకి వెళ్లి కషాయంలో పసరు మందు కలుపబోతుంది. ఇంతలో కనకం వచ్చి రుద్రాణి చేయి పట్టుకుంటుంది. రుద్రాణి షాక్ అవుతుంది.
కనకం కోపంగా ఏం చేస్తున్నావు.. అని అడుగుతుంది. దీంతో రుద్రాణి నేనేం చేస్తున్నాను. కావ్య కషాయం తాగాలి కదా..? అంటుంది. కావ్య కషాయం తాగడం కాదు.. నువ్వెందుకు నా కూతురు గదికి వచ్చావు.. నా కూతురు తాగే కషాయం పట్టుకున్నావు అని అడుగుతుంది. దీంతో రుద్రాణి కూల్గా చెప్తున్నాను కదా కనకం.. సీమంతం హడావిడిలో పడి కావ్య కషాయం తాగడం మర్చిపోయింది. అందుకే కావ్యకు కషాయం ఇద్దామని వచ్చాను అంతే అని చెప్పగానే.. కావ్యకు కషాయం ఇచ్చేదానివే అయితే నీ దగ్గర ఉన్న దాన్ని నా కూతురు కషాయంలో ఎందుకు కలుపుతున్నావు అని కనకం అడగ్గానే.. రుద్రాణి అది అంటూ ఏమీ చెప్పదు.. దీంతో చెప్పు ఏం చేయబోతున్నావు.. అని గట్టిగా అడగ్గానే.. ఏంటి కనకం ఏం మాట్లాడుతున్నావు నీకు ఎలా కనబడుతున్నాను అని అడగ్గానే.. అయిన వాళ్లకు కీడు చేయాలనుకున్న ఆడదానిలా కనిపిస్తున్నావు.. రాక్షసిలా కనిపిస్తున్నావు.. అనగానే..
రుద్రాణి కోపంగా మాటలు మర్యాదగా రాని.. అనగానే.. మర్యాదా..? అది నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు.. అందుకే అందరి కళ్లు కప్పి ఏదో కీడు తలపెట్టబోతున్నావు అంటుంది. దీంతో రుద్రాణి కనకం నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు.. అనగానే.. నేనేం మర్చిపోలేదు.. నేను కావ్య తల్లిని ఆ స్థాయితోనే మాట్లాడుతున్నాను.. అసలు ఏంటిది అని అడగ్గానే.. కనబడటం లేదా..? కషాయం అని రుద్రాణి చెప్పగానే.. అది కషాయం కాదు.. పసరు మందు. ఆ పసరు మందు నా బిడ్డ తాగే కషాయంలో ఎందుకు కలుపుతున్నావు.. అని అడగ్గానే.. కనకం నువ్వు చాలా మాట్లాడుతున్నావు.. నేను ఈ ఇంటి మనిషినే.. నేనేందుకు తప్పు చేస్తాను.. అయినా అల్లరి చేస్తానంటే చేయ్ కింద జరిగే సీమంతం చెడగొట్టాలనే కదా నీ ఉద్దేశం అనగానే.. కనకం అయోమయంలో పడిపోతుంది. రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తర్వాత కింద సీమంతం జరుగుతుంటుంది. అందరూ వెళ్లి ఒక్కొక్కరుగా అప్పు, కావ్యలకు బొట్టు పెట్టి దీవిస్తుంటారు. ఇంతలో రుద్రాణి బొట్టు పెడుతుంటే బయటి నుంచి కనకం వస్తుంది. కనకం పక్కన వీరయ్యను చూసి రుద్రాణి షాక్ అవుతుంది. కనకం అందరికీ నిజం చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.