Sangareddy District: సరదాగా పతంగి ఎగరేద్దామనుకున్న బాలుడికి కాస్తలో ప్రాణాపాయం తప్పింది. సంగారెడ్డి జిల్లా డాకూరు గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం వద్ద ఆరేళ్ల బాలుడు అరవింద్ ఎంతో ఉత్సాహంగా పతంగి ఎగరేస్తుండగా ఊహించని ప్రమాదం సంభవించింది. వాతావరణం అనుకూలించడంతో ఆకాశంలోకి పతంగిని ఎగురవేస్తుంటే, అది అనుకోకుండా సమీపంలోనే ఉన్న విద్యుత్ తీగలకు (High-Tension Wires) చిక్కుకుపోయింది. ఆ సమయంలో బాలుడు పతంగిని విడిపించే ప్రయత్నంలో మాంజాను గట్టిగా లాగడంతో, విద్యుత్ ప్రవాహం ఒక్కసారిగా మాంజా ద్వారా బాలుడికి తగిలి తీవ్రమైన కరెంట్ షాక్కు గురయ్యాడు.
విద్యుత్ షాక్కు గురైన వెంటనే బాలుడు అరవింద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఒళ్లు మొద్దుబారి తీవ్ర గాయాలవ్వడంతో గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాలుడిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాలుడికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Also Read: దారుణం.. అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు
అయితే సంక్రాంతి పండుగ వేళ పిల్లలు, యువత పతంగి ఆటలో మునిగిపోయి పరిసరాలను గమనించకపోవడం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా విద్యుత్ లైన్లకు చిక్కుకున్న గాలిపటాలను లాగడం లేదా ఇనుప చువ్వలతో తీయడానికి ప్రయత్నించడం ప్రాణాంతకం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారో గమనిస్తూ, విద్యుత్ స్తంభాలు, హైటెన్షన్ వైర్లకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.