ఎంత చెప్పినా ఆరు వినడం లేదని గుప్త కోపంగా బాలిక నీకే చెప్పుచున్నది. ఇప్పటికే చాలా సమయం మించి పోయింది. మా లోకమునకు వెళ్లెదము పద అంటాడు. ఆరు పలకదు.. దీంతో గుప్త వచ్చిన కార్యము ముగిసినది కదా బాలిక. ఇక మా లోకమును వెళ్లెదం పదా.. బాలిక నీతోనే చెప్పుచున్నది. నీ సహోదరి సీమంతపు వేడుకు వీక్షించవలెను అన్నావు. నీ చేతుల మీదుగానే సీమంతం జరిపించావు.. ఇంతటితో సంతృప్తి చెందుము రమ్ము మా లోకమునకు వెళ్లెదము అని గుప్త అడగ్గానే.. గుప్త గారు ఇంకొద్ది సేపు ఆగుదాం అని చెప్తుంది ఆరు. దీంతో గుప్త కోపంగా కొద్ది సేపు కొద్ది సేపు అని ఇప్పటికే చాలా సమయం నువ్వు మమ్ములను ఇచ్చట ఉంచితివి బాలిక. నీపై మాకు ఉన్న గౌరవంతో నీపై మాకు ఉన్న అభిమానంతో మేము ఆగితిమి… మాకును నువ్వు అదే గౌరవం ఇవ్వవలెను అని గుప్త చెప్పగానే…
ఆరు ఎమోషనల్ అవుతూ గుప్త గారు మీరే లేకపోతే నేను ఇదంతా చేయలేను. కానీ అంటూ ఏదో చెప్పబోతుంటే.. మరలా కానీ ఏంటి బాలిక.. అవతల మా ప్రభువుల వారు వీక్షించుచున్నారు. వారు నీకును మాకును ఎటువంటి దండన విదించెదరో అని మథన పడుతున్నాను.. పైగా నారదుల వారు వచ్చిరని వింటిని.. బాలిక పద మనం మా లోకమునుక వెళ్దాం పద.. అనగానే.. వెళ్దాం గుప్త గారు.. కానీ కాసేపు ఆగి వెళ్దాం అని ఆరు చెప్పగానే.. కాసేపు అనగా ఎంత వరకు బాలిక నీ సహోదరి ప్రసవించే వరకా..? అని గుప్త అడగ్గానే.. మీకు టైం ఉంటే అప్పటి వరకు ఉందాము గుప్త గారు అంటుంది ఆరు.
అప్పటి వరకు నీవు ఇచ్చట ఏమి చేయుదువు బాలిక.. జన్మించగానే.. మరణించే ఆ పసికందు మృతదేహమును వీక్షించెదవా..? ఆ మృత దేహమును చూస్తూ రోదించే నీ సహోదరిని వీక్షించెదవా..? ఇదంతా చూస్తూ గుండె పగిలేలా ఏడ్చే నీ పితృదేవుడిని చూసెదవా..? లేక నీ పతిదేవుడు, పిల్లల కన్నీళ్లు చూసెదవా..? ఇంతటి విషాదమును వీక్షించుటకా నీవు ప్రాదేయపడి భూలోకం వచ్చినది. జన్మించబోవు ఆ శిశువు నీకు కాదు. ఆ శరీరం నీది కాదు. ఆ జన్మ నీది కాదు.. ఇంకను ఎందులకు నీకు ఆ మమకారం. నీవేమియు దేవతవు కాదు.. నీకేమి శక్తులు లేవు.. ఇదంతయూ నీవు ఆపుటకు.. అని గుప్త చెప్పగానే..
అవును గుప్త గారు.. నేను మీలాంటి దేవుడిని కాదు.. దేవతను కాదు నాకు ఏ శక్తులు లేవు.. నేను సాధారణ మనిషిని అందుకే నాకు ఈ మమకార. నన్ను హఠాత్తుగా చంపేశారు.. నాకు మళ్లీ జన్మ ఉందని.. నా చెల్లికి నేనే మళ్లీ పుడతానని చెప్పారు. తీరా పైకి వచ్చాక అది అబద్దం అన్నారు.. నాకు మరు జన్మ లేదు అన్నారు.. నాకు ఇదే ఆఖరి జన్మ అన్నారు.. అయితే నేను నా వాళ్లను మళ్లీ చేరే అవకాశం లేకపోతే ఇదే కదా నేను నా వాళ్లతో ఉండే ఆఖరి ఘడియలు అందుకే.. నా వాళ్లని వదిలి రావాలి అనిపించడం లేదు గుప్త గారు ఎంత సేపు ఇక్కడ ఉన్నా తనివి తీరడం లేదు.. నా మనసు అంతా ఇక్కడే ఉంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి.. అంటూ ఆరు ఏడుస్తూ అడగ్గానే..
నీ ఆవేదన మాకు అవగతం అయినది బాలిక కానీ నువ్వు ఇచట ఉండరాదు.. జరగబోవు విషాదమును నువ్వు వీక్షించి తట్టుకోలేవు.. పైగా నీ శోకము నీ కుటుంబమునకు మంచిది కాదు.. అందుకే మా లోకమునకు వెళ్లెదమని పిలుచుచున్నాను.. చూసితివా బాలిక ప్రకృతి కూడా విలయతాండవం చేస్తుంది అని చెప్పగానే.. ఆరు వినదు.. దీంతో గుప్త కోపంగా ఆరును తిడతాడు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.