సరస్వతి వార్డెన్ ఆశ్రమ పిల్లలతో మిస్సమ్మ కోసం హోమం చేయిస్తుంటే.. అక్కడికి అమ్ము, ఆనంద్, ఆకాష్, అంజు వెళ్తారు. వాళ్లను చూసిన సరస్వతి మీరెందుకు వచ్చారమ్మా అని అడుగుతుంది. దీంతో అమ్ము మా మిస్సమ్మ కోసం వచ్చాము అని చెప్తుంది. మా మిస్సమ్మను బతికించమని దేవుడిని కోరడానికి వచ్చాం అని అంజు చెప్తుంది. దీంతో రాజు ఈ పిల్లలు కూడా అందుకే వచ్చారమ్మా ఆ హోమం ఏదో వీళ్లు చేస్తారు మీరు హాస్పిటల్కు వెళ్లండి అని చెప్పగానే.. లేదు మేము కూడా హోమం చేస్తాము. మిస్సమ్మ కోసం వీళ్లే ఇంత చేస్తే మేము ఇంకెంత చేయాలి అంటాడు ఆనంద్. మిస్సమ్మ మీ ఆశ్రమానికి డబ్బులు మాత్రమే ఇచ్చింది కానీ మా కోసం తన జీవితాన్నే ఇచ్చింది అని అమ్ము చెప్తుంది.
ఆకాష్ కూడా ఎమోషనల్ అవుతూ మిస్సమ్మ ముందు మాకు ట్యూషన్ టీచర్ అయింది. తర్వాత కేర్ టేకర్ అయింది. ఇప్పుడు అమ్మ కూడా అయింది అని చెప్తాడు. మా అమ్మ కోసం మేము హోమం చేస్తాము అంటుంది అంజు. దీంతో పంతులు తప్పకుండా అందరూ కలిసి హోమం చేయండి కాకపోతే హోమం ముగిసే వరకు మీరంతా ఉపవాసం ఉండాలి అని చెప్తాడు. అయ్యో ఈ పిల్లలు ఉదయం నుంచి ఏమీ తినలేదు పంతులు గారు అని సరస్వతి చెప్తుంది. మేము కూడా ఇప్పటి వరకు ఏమీ తినలేదని ఆనంద్ చెప్తాడు. ఎంత టైం అయినా సరే మేము కూడా ఏమీ తినకుండా హోమం చేస్తాము అని ఆకాష్ చెప్తాడు. హోమం ఏంటో చెప్పండి పంతులు గారు అని అంజు అడగ్గానే.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. భక్త మార్కండేయుడిని మృత్యువును నుంచి కాపాడి చిరంజీవిని చేసింది ఆ పరమశివుడే అని పంతులు చెప్పగానే.. పిల్లలు శివుడిని మొక్కుతుంటారు. మీరందరూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే శివుడు కరుణించి మీ అమ్మ గారిని కాపాడతాడు అని పంతులు చెప్పగానే.. అలాగే చేస్తాం పంతులు గారు మీరు హోమం మొదలు పెట్టండి అంటుంది అమ్ము. దీంతో పంతులు హోమం మొదులు పెట్టగానే.. పిల్లలు అందరూ ఓం నమఃశివాయ అంటూ జపిస్తూ ఉంటారు.
యమలోకంలో ఉన్న ఆరు మాయాదర్పణంలో మిస్సమ్మను చూసిన విషయం గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో గుప్త వచ్చి బాలిక మాతో రమ్ము బాలిక వచ్చి మరోక్కసారి మాయా దర్పణం చూడుము అని చెప్పగానే.. ఏం చూడమంటారు గుప్త గారు చావు బతుకుల్లో ఉన్న నా చెల్లిని చూడమంటారా..? దాని కోసం బాధపడుతున్న నా తండ్రిని, భర్తని, పిల్లలను చూడమంటారా..? నన్ను చంపి నా చెల్లెలి చావుకు కూడా కారణం అవుతున్న ఆ మనోహరిని చూడమంటారా..? ఎవరిని చూడమంటారు అంటూ కోపంగా అడుగుతుంది. దీంతో గుప్త చిగురిస్తున్న ఆశలను చూడుము బాలిక. కొడిగడుతుంది అనుకున్న ప్రాణదీపం కోవెల దీపంగా మారుతున్నది చూడుము.. మీ మనుషులలో ఇంకనూ మిగిలి ఉన్న మానవత్వమును..కృతజ్ఞతతను వచ్చి వీక్షించుము.. రమ్ము బాలిక రమ్ము.. వీక్షించుము.. జరుగునది జరుగబోవునది.. అంటూ మాయాదర్పణం చూపిస్తాడు గుప్త. మాయాదర్పణం చూస్తున్న ఆరు కోపంగా చితికిపోతున్న ప్రాణం తప్పా చిగురిస్తున్న ఆశ ఎక్కడుంది గుప్త గారు అని అడుగుతుంది. దీంతో గుప్త నీవు వీక్షించుచున్న ఈ దృశ్యమున నీ పిల్ల పిచ్చుకలు ఎచ్చట బాలిక అని గుప్త అడగ్గానే.. అవును నా పిల్లుల ఎక్కడ గుప్త గారు అంటూ ఆరు కంగారు పడుతుంది. దీంతో గుప్త కంగారు పడకుము.. వీక్షించుము అని చెప్పగానే.. మాయాదర్పణంలో పిల్లలు హోమం చేయడం చూస్తుంది ఆరు. పిల్లలు చేస్తున్న ఆ ప్రయత్నాన్ని చూసి ఆరు ఎమోషనల్ అవుతుంది.
హోమం అయిపోయిన తర్వాత మిస్సమ్మ కోలుకుంటుంది. డాక్టర్ వచ్చి పెద్ద గండం గట్టెక్కిందని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో పిల్లుల కూడా హాస్పిటల్కు వస్తారు. ఐసీయూలోకి వెళ్లి మిస్సమ్మను చూసి పలకరిస్తారు. భాగీ కళ్లు తెరిచి చూడగానే.. మిస్సమ్మ ఇప్పుడెలా ఉంది మిస్సమ్మ అని అంజు అడుగుతుంది. బాగుంది అంజు అని భాగీ చెప్పగానే.. చెల్లి ఎలా ఉంది అని అంజు అడుగుతుంది. తను కూడా బాగుందని డాక్టర్ చెప్పారు అని భాగీ చెప్పగానే.. అమ్ము హోమం దగ్గర నుంచి తీసుకొచ్చిన బొట్టు భాగీకి పెడుతుంది. ఇంతలో రామ్మూర్తి ఎవరో బ్లాక్ మ్యాన్ వచ్చి విష వాయువు వదిలి వెళ్లాడని అల్లుడు గారు చెప్తున్నారు అమ్మ. ఇంట్లో ఉన్న యాదమ్మకు మనోహరికి ఏమీ కాలేదు. వాళ్లు ఎలా తప్పించుకున్నారు అని రామ్మూర్తి అడుగుతాడు. నువ్వు మాత్రమే ప్రమాదంలో పడి వాళ్లు మాత్రం ఎలా ఎస్కేప్ అయ్యారు అని అమ్ము అడుగుతుంది. డోర్ దగ్గర నిలబడి అంతా వింటున్న చంభా, మనోహరి భయంగా అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోతుంటే.. అమర్ వచ్చి మనోహరి అని పిలుస్తాడు. దీంతో మనోహరి, చంభా భయంతో ఆగిపోతారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.