Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, ముఖ్యంగా కాపు సామాజికవర్గ హక్కుల పోరాటాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద లోటును మిగిల్చింది.
1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం.. చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. 1989 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్, చెన్నారెడ్డిల హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయి. కాగా, ఇటీవలి 2024 ఎన్నికల ముందర ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు.. సామాన్య భక్తులకు గుడ్ న్యూస్.. దాతల దర్శనాల్లో కీలక మార్పులు!