Wayanad Video: కేరళలోని వయనాడ్లో మరోసారి ప్రకృతి కన్నెర్ర జేసింది. కల్లాడి సొరంగం సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతం క్షణాల్లో శ్మశానాన్ని తలపించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికి పైగా ప్రజలు కొండ శకలాలు, మట్టి శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చూస్తుండగానే కొండ పైభాగం నుంచి భారీగా మట్టి, బండరాళ్లు ఉరుముల వేగంతో కిందకు దూసుకురావడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రాళ్ల ఉధృతికి దారిలో ఉన్న చెట్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ దృశ్యాలు చూస్తుంటేనే గుండె జారిపోయేలా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికులు, రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, బురద కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బాధితుల కుటుంబాల్లో ఈ ఘటన తీరని ఆవేదనను మిగిల్చింది.