రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరినీ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ ద్వారా వాట్సప్ గ్రూపుల్లో మెసేజులు పంపడం.. బ్యాంకుల పేర్లతో అలర్ట్ మెసేజులు పంపడం, ఆధార్ అప్డేట్ అంటూ ఫేక్ మెసేజులు పంపడం వంటి సులభమైన మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఒకవేళ మీకూ ఇలాంటి అనుభవమే ఎదురైతే.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సైబర్ ఎక్స్పర్ట్ రూపేష్ మాటల్లోనే విందాం..
సైబర్ నేరగాళ్లు పంపిన లింకుల ఓపెన్ చేస్తే.. డైరెక్ట్ మన ఫోన్లోనే ఏపీకే డౌన్లోడ్ అవుతుంది. అలా ఇన్స్టాల్ అయిన ఏపీకే ఫైల్లో ఒక హిడెన్ మాల్వేర్ ఉంటుంది. ఇది మన ఫోన్లోని బ్యాంకు వివరాలను తక్షణమే తీసేకుంటుంది. దాంతో పాటు మన నెంబరుకు వచ్చే ఓటీపీలను సైబర్ నేరగాళ్ల నెంబర్లకు ఫార్వర్డ్ చేస్తుంది. ఇలా మన బ్యాంకు ఖాతాలోని డబ్బును దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే.. మన ఫోన్కు వచ్చే మెసేజుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఎటువంటి ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకుండానే, ఓటీపీలు షేర్ చేయకుండానే మీ ఖాతాలోని డబ్బు మాయం అయ్యిందంటే.. RBI రూల్స్ ప్రకారం డబ్బు చోరీ జరిగిన మూడ్రోజుల్లోగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఇలా తక్షణ ఫిర్యాదుతో మీరు కోల్పోయిన డబ్బు 100% శాతం రీఫండ్ చేయబడుతుంది. ఇలాంటి చోరీలకు గురవ్వకుండా ఉండాలంటే.. మీకొచ్చే మెసేజుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్ రూపేష్.