ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూనే.. మరోవైపు ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది భారతీయ రైల్వే. ఇప్పటి వరకు సినిమా షూటింగ్స్ కు రైల్వే స్టేషన్లు, రైళ్లను అద్దెకు ఇవ్వగా, ఇప్పుడు సరికొత్త నమో భారత్ రైళ్లలో కూడా ప్రైవేట్ ఈవెంట్స్ నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(NCRTC) తొలిసారి ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ-మీరట్ కారిడార్ లోని నమో భారత్ రైళ్లు, స్టేషన్లను ఇప్పుడు ప్రత్యేక వ్యక్తిగత కార్యక్రమాల కోసం బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. బర్త్ డే పార్టీలు, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లు, ఇతర వేడుకలను జరుపుకోవచ్చని వెల్లడించింది. ఈ హై స్పీడ్ రైలు వ్యవస్థను ప్రజా రవాణా కోసంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఫోటోగ్రఫీ, ఈవెంట్లు, కమర్షియల్ షూట్ల కోసం రైల్వేను క్రియేటివ్ స్పాట్ గా ఉపయోగించుకునే ధోరణి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో NCRTC కీలక నిర్ణయం తీసుకుంది. NCRTC తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ప్రైవేటు వ్యక్తులు, ఈవెంట్ ప్లానర్లు, ఫోటోగ్రాఫర్లు, మీడియా కంపెనీలు స్టాటిక్ కోచ్లు, నడుస్తున్న నమో భారత్ రైళ్లను బుక్ చేసుకోవచ్చు. షూటింగుల కోసం దుహై డిపోలో ప్రత్యేక మాక్ అప్ కోచ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక సెటప్ లు, లైటింగ్ కోసం అవసరమైన పరిస్థితులను ఏర్పాటు చేశారు. ఇక ప్రైవేటు అవసరాల కోసం నమో భారత్ రైళ్లను ఉపయోగించుకునేందుకు గంటకు రూ. 5,000గా నిర్ణయించినట్లు NCRTC తెలిపింది. ప్రతి బుకింగ్ లో సెటప్, ప్యాక్ అప్ కోసం అదనంగా 30 నిమిషాల సమయం ఇస్తుంది. ఈవెంట్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య మాత్రమే జరుపుకునేందుకు అనుమతిస్తుంది. ఈవెంట్ నిర్వాహకులు కోచ్, స్టేషన్ ప్రాంతాన్ని అలంకరించవచ్చు. అయితే, రైల్వే కోచ్ లకు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు. ప్రయాణీకుల సర్వీసులకు ఇబ్బంది కలిగించే పనులను అనుమతించదు.
ఈ ఫిల్మ్ షూట్ లు, ఈవెంట్లు నిర్వహించే సమయంలో భద్రత కోసం, సజావుగా కార్యకలాపాలు జరిగేందుకు NCRTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఏ ఈవెంట్ అయినా ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేయకుండా, రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆపరేషనల్ టైమింగ్స్ కు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని కార్పొరేషన్ తేల్చి చెప్పింది. వ్యక్తిగత ఈవెంట్లతో పాటు, NCRTC ఫిల్మ్ షూట్లు, డాక్యుమెంటరీలు, ప్రకటనలు, డిజిటల్ కంటెంట్ కోసం ప్రత్యేక రైలు కోచ్ తో కూడిన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. నమో భారత్ ను ఫిల్మ్ మేకర్స్, కంటెంట్ క్రియేటర్స్ కు హాట్ స్పాట్గా మారబోతోంది. ఆనంద్ విహార్, ఘజియాబాద్, సాహిబాబాద్, దుహై, మీరట్ సౌత్ లాంటి స్టేషన్లలో ఈ షూట్స్ అవకాశం కల్పించనుంది. ఈ నిర్ణయం సృజనాత్మక వ్యక్తీకరణకు సపోర్టు ఇవ్వడంతో పాటు ఆదాయాన్ని పొందే అవకాశం కల్పిస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Read Also: మన హిమాలయాలకు అరుదైన గుర్తింపు.. టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్స్ లో ఫస్ట్ ప్లేస్!