Viral Video: ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గైనకాలజిస్ట్ ప్రజ్ఞా తోమర్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 22 ఏళ్లకే ఆరోసారి గర్భవతి అయిన మహిళ గురించి ఈ వీడియోలో ఆమె పోస్ట్ చేశారు. అప్పటికే ఐదుగురు పిల్లలు (నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి) ఉన్న సదరు మహిళ.. మరో అబ్బాయి కోసం ఆరోసారి గర్భవతి అయినట్లు డాక్టర్ తో చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో కోపం చిర్రెత్తుకొచ్చిన డాక్టర్.. వారిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం వీడియోలో చూడవచ్చు.
డాక్టర్ తో సంభాషణ సందర్భంగా గర్భవతి అయిన మహిళ మాట్లాడుతూ.. ‘మాకు ఆడపిల్లలు, ఒక అబ్బాయి మాత్రమే ఉన్నారు. మాకు మరో అబ్బాయి కావాలి’ అని చెప్పింది. కుటుంబాన్ని పోషించడానికి ఒక అబ్బాయి ఉంటే సరిపోదని.. ఆమె భర్త కూడా వాదించాడు. దీన్ని బట్టి సమాజంలో లింగ వివక్ష ఏ స్థాయిలో పాతుకుపోయిందో ఈ ఘటన అద్దం పడుతోంది. మరోవైపు డాక్టర్. ప్రజ్ఞా తోమర్ కలుగజేసుకొని.. పదే పదే గర్భం దాల్చడం వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్య సమస్యల గురించి దంపతులను హెచ్చరించారు. కొడుకు కోసం పడే ఆరాటంలో ఒకరి జీవితాన్ని నాశనం చేయడం సరైనదేనా? అని ప్రశ్నించారు.
Also Read: పళనిస్వామికి బిగ్ షాక్.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా.. ఎందుకంటే?
‘ఇదంతా ఒక మగవారసుడి కోసమే. రాజస్థాన్ కు చెందిన ఈ జంట కథ మిమ్మల్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేయవచ్చు’ అనే క్యాప్షన్ తో గైనకాలజిస్ట్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భర్తపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కుటుంబానికి కావాల్సిన ఆహారం, నివాసం, బట్టలు కూడా సమకూర్చలేని స్థితిలో ఉంటూ ఇంకా సంతానం కోసం పరితపించడం ఏంటని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. 22 ఏళ్లకే ఆరోసారి ప్రెగ్నెంట్ అంటే.. ఆమె మైనర్ గా ఉన్నప్పుడే వివాహం చేసుకొని ఉండొచ్చని మరొకరు పోస్ట్ పెట్టారు. ఇది చట్టరిత్యా నేరమని పేర్కొన్నారు.
Also Read: ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 4 చిట్కాలతో.. ఇంటి పైకప్పును ఐస్లా మార్చేయండి!