చిన్న చిన్న కారణాలకే వివాహ బంధాలు కుప్పకూలిపోతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన ఘటన చూస్తే, ఆశ్చర్యం కలగక మానదు. ఉల్లిపాయ గురించి చెలరేగిన వివాదం కారణంగా 22 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఆ దంపతులకు గుజరాత్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
అహ్మదాబాద్ కు చెందిన దంపతులకు 2002లో వివాహం జరిగింది. కొంతకాలం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి సంసారం కొనసాగింది. ఆ తర్వాత భార్య స్వామి నారాయణను కొలవడం మొదలుపెట్టింది. నిష్టగా పూజలు చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే ఆమె వంటకాల్లో ఉల్లిపాయలను ఉపయోగించకూడదని నిర్ణయించింది. ఇంట్లో కూడా ఇకపై వాటిని వాడకూడదని చెప్పింది. అయితే, ఆమె భర్త, అత్త మాత్రం ఉల్లిపాయలను తినడం ఆపలేదు. ఎంత వద్దని చెప్పినా వినిపించుకోలేదు.
ఉల్లిపాయల కారణంగా తరచుగా వారి కుటుంబంలో వివాదాలు జరిగేవి. నెమ్మదిగా భార్య.. భర్త, అత్త వేర్వేరుగా వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ వేర్పాటు మరింత ముదిరింది. ఇంట్లో ఉద్రిక్తత పెరగడం ప్రారంభమైంది. నెమ్మదిగా వివాహ బంధానికి బీటలువారడం మొదలు పెట్టాయి. చివరికి భార్య తన బిడ్డతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. 2013లో, భర్త విడాకులు కోరుతూ అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య ఆహారపు అలవాట్లను తమ మీద రుద్దడం క్రూరత్వం అని ఆరోపించాడు. 2024లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసి, భరణం చెల్లించాలని ఆదేశించింది.
ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని భార్య సవాలు చేయడంతో కేసు గుజరాత్ హైకోర్టుకు వెళ్లింది. భర్త తన మతపరమైన ఆహార పరిమితులను కించపరిచాడని ఆరోపించింది. ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం నిరంతర సంఘర్షణకు కారణం అయ్యిందని భర్త వాదించాడు. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా ఆమె కోసం వంట చేసినా, చీటికి మాటికి గొడవలు పడేదని చెప్పాడు. ఈ గొడవల కారణంగా తాను ఒకసారి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పాడు.
Read Also: గ్రోక్ను రూ.2 వేలు అప్పు అడిగిన నెటిజన్.. దాని సమాధానం తెలిస్తే షాకవుతారు!
హైకోర్టు విచారణ సందర్భంగా, భార్య విడాకులు తీసుకునేందుకు ఒప్పుకుంది. భర్తకు భరణం చెల్లించాలని న్యాయస్థానం చెప్పింది. ఆ భరణాన్ని కోర్టులో వాయిదాల పద్దతిలో జమ చేయాలని అంగీకరించింది. చివరకు కోర్టులో విడాకులకు పరస్పరం అంగీకరించడంతో, హైకోర్టు భార్య పిటిషన్ను కొట్టివేసి విడాకులను సమర్థించింది. చిన్న గొడవకు విడాకులు తీసుకోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Read Also: గ్రోక్ను రూ.2 వేలు అప్పు అడిగిన నెటిజన్.. దాని సమాధానం తెలిస్తే షాకవుతారు!