Bank Manager Fraud: సినిమా కథను తలపించేలా సామాన్య ఖాతాదారులను మోసం చేసి, కోట్లాది రూపాయలు కాజేసిన ఓ బ్యాంక్ మేనేజర్ వ్యవహారం బెంగళూరులో తీవ్ర సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తున్న రఘు అనే వ్యక్తి.. ఈ భారీ మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా బంగారం కుదవ పెట్టిన ఖాతాదారులనే లక్ష్యంగా చేసుకుని.. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
సుమారు 41 మంది ఖాతాదారులను మేనేజర్ రఘు మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బ్యాంకు సంబంధిత పనుల పేరుతో ఖాతాదారుల నుంచి ఖాళీ చెక్కులను తీసుకోవడం, వారి మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీలను వివిధ కారణాలు చెబుతూ సేకరించడం, అతని ప్రధాన ఎత్తుగడగా మారింది. సాధారణంగా బ్యాంకు మేనేజర్ చెప్పిన మాటలను నమ్మే ఖాతాదారులు, ఎలాంటి అనుమానం లేకుండా తమ వ్యక్తిగత వివరాలను అతనికి అందించారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఖాతాదారులు బ్యాంకులో.. కుదవ పెట్టిన బంగారం పైనే వారికి తెలియకుండా రుణాలు తీసుకున్నాడు రఘు. ఆ రుణాలను ఖాతాదారుల పేర్లపైనే డ్రా చేసి, మొత్తం సొమ్మును తన నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధంగా ఒక్కో ఖాతాదారుడి పేరుతో చిన్న మొత్తాలుగా రుణాలు తీసుకుంటూ, మొత్తం రూ. 3.11 కోట్ల వరకు అక్రమంగా డ్రా చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
ఈ భారీ మోసం చాలా కాలంగా సాగినా, బయటకు రాకపోవడం గమనార్హం. అయితే ఇటీవల బ్యాంకులో ఉన్నతాధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ లావాదేవీలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. రుణాల వివరాలు, బంగారు కుదవ పత్రాలు, ఖాతాదారుల సంతకాల్లో ఉన్న తేడాలు అధికారులకు అనుమానం కలిగించాయి. వెంటనే ఆడిట్ చేపట్టడంతో మేనేజర్ రఘు బాగోతం మొత్తం బయటపడింది.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఖాతాదారులు తీవ్ర షాక్కు గురయ్యారు. బ్యాంకు మేనేజర్పైనే నమ్మకం పెట్టుకుని తమ బంగారం భద్రంగా ఉందని భావించిన వారు, తమ పేరుతో కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న విషయం తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనపై బ్యాంకు ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. మేనేజర్ రఘుపై క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఖాతాదారులకు నష్టం కలగకుండా వారి బంగారం, రుణాల విషయంలో తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ బ్యాంక్ మోసం ఇప్పుడు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ ఈ ఘటన తెగ వైరల్ అవుతోంది.